భారీ మొత్తంలో నగదు, బంగారం లభ్యం. స్వాధీనం చేసుకున్న పోలీసులు.
నగర శివారులో వదిలి వెళ్ళిన కారులో 52 కేజీల బంగారం, రూ.10 కోట్ల నగదు
మధ్యప్రదేశ్ లోని భోపాల్ నగరంలో ఆదాయ పన్ను శాఖ అధికారులు, లోకాయుక్త పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన దాడుల్లో ఆసక్తికరమైన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. అటవీ మార్గం గుండా పెద్ద ఎత్తున బంగారాన్ని తరలిస్తున్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు పెద్ద ఎత్తున పోలీసు బలగాలు, ఐటీ అధికారులు రంగంలోకి దిగారు. నగర శివార్లలోని మెండోరీ ప్రాంతంలో వారికి నిలిపి ఉంచిన ఓ కారు కనిపించింది. .కారులో ఉన్నవారు తప్పించుకు కోకుండా 30 పోలీసు వాహనాలతో సుమారు 100 మంది పోలీసులు కారును చుట్టుముట్టారు. కారును తనిఖీ చేసిన అధికారులకు మతిపోయింది. అందులో ఎవరూ లేకపోగా… 52 కిలోల బంగారం, సుమారు 10 కోట్ల రూపాయలు వాహనంలో ఉన్నాయి. నగదుతో , బంగారంతో ఉన్న రెండు బ్యాగులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
కారును గ్వాలియర్ కు చెందిన ఓసౌరభ్ శర్మ అనే వ్యక్తికి చెందినదిగా గుర్తించారు. ఇతను మాజీ కానిస్టేబుల్. గతంలో ఆర్టీవో ఆఫీసు వద్ద విధులు నిర్వర్తించినట్లు సమాచారం.
ఆదాయ పన్ను శాఖ అధికారుల దాడుల్లో పలువురు బిల్డర్లతో పాటు సౌరభ్ శర్మ కూడా ఉన్నాడు. భోపాల్ నగరంలోని ఖరీదైన ప్రాంతంలో ఉన్న శర్మ నివాసంపై ఐటీ అధికారులు గురువారం నాడు దాడులు చేయగా, రూ.1 కోటి నగదు, అరకిలో బంగారం పట్టుబడ్డాయి. అంతేకాదు, విలువైన వజ్రాలు, వెండి కడ్డీలు, ఆస్తి పత్రాలు కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు.