గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి.

గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఎంపీడీవోకు వినతిపత్రం ఇచ్చిన – ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా(TUCI) జిల్లా అధ్యక్షులు ఆర్. మధుసూదన్ రెడ్డి.

గోల్డెన్ న్యూస్ / పినపాక : గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 27, 28 తేదీల్లో జరిగే రాష్ట్రవ్యాప్త టోకెన్ సమ్మెను జయప్రదం చేయాలని TUCI జిల్లా అధ్యక్షులు ఆర్. మధుసూదన్ రెడ్డి గ్రామపంచాయతీ కార్మికులను కోరారు. టోకెన్ సమ్మెకు సంబంధించిన సమ్మె నోటీసు ను పినపాక ఎంపీడీవో, ఎంపీవో  కు ఇచ్చారు. అనంతరం గ్రామపంచాయతీ కార్మికుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. .

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ పంచాయతీ కార్మికులు చెత్త, చెదారం మధ్య పని చేస్తూ తమ ఆరోగ్యాలను పణంగా పెట్టి పల్లెలను శుభ్రంగా ఉంచుతూ ప్రజల ఆరోగ్యాలను కాపాడుతుంటే వారి సమస్యలను పరిష్కరించవలసిన ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. వారికి శ్రమకు తగ్గ ఫలితం ఇవ్వకుండా వారి శ్రమను కారు చౌకగా దోచుకుంటున్నారని విమర్శించారు. మున్సిపాలిటీలో, గ్రామపంచాయతీలో పనిచేసే కార్మికులు ఓకే పని చేస్తున్నప్పటికీ మున్సిపాలిటీలో జీవో నెంబర్ 60 ప్రకారం16,500 చెల్లిస్తుంటే గ్రామపంచాయతీ కార్మికులకు మాత్రం 9500 మాత్రమే చెల్లిస్తున్నారన్నారు. ఈ వేతనాలు కూడా ప్రతి నెల చెల్లించకుండా నెలల తరబడి పెండింగ్ పెడుతున్నారు అన్నారు. దీనివల్ల కుటుంబ పోషణ భారమై కార్మికులు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు అన్నారు. మల్టీపర్పస్ విధానం పేరుతో అనుభవం లేని పనులు చేయించడం వలన అనేక మంది మృత్యువాత పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వీరికి ఎలాంటి చట్టబద్ధ హక్కులు, సౌకర్యాలు కల్పించడం లేదన్నారు. గ్రామపంచాయతీ కార్మికులకు జీవో నెంబర్ 60 ప్రకారం వేతనాలు చెల్లించాలని, గ్రామపంచాయతీ కార్మికులకు ప్రతినెల జీతాలు చెల్లించుటకు ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్ ను కేటాయించాలని, మల్టీపర్పస్ వర్కర్స్ విధానాన్ని రద్దు చేయాలని,

ఉద్యోగ భద్రత కల్పించాలని, పిఎఫ్, ఈఎస్ఐ, ఇన్సూరెన్స్ సౌకర్యాలు కల్పించాలని, పదవీ విరమణ బెనిఫిట్ కింద 5 లక్షలు చెల్లించాలని, కార్మికులు మరణించినా, పదవీ విరమణ పొందినా వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగ అవకాశం కల్పించాలని తదితర డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ, గ్రామపంచాయతీ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఈ నెల 27, 28 తేదీలలో రాష్ట్రవ్యాప్త టోకెన్ సమ్మె కు పిలుపునివ్వడం జరిగిందని, ఈ టోకెన్ సమ్మెలో ప్రతి ఒక్క గ్రామ పంచాయతీ కార్మికుడు పాల్గొని విజయవంతం చేసి ప్రభుత్వానికి కనువిప్పు కలిగించాలన్నారు.   ఈ సమావేశంలో తిరుపతి, భాస్కర్, సతీష్, శంకర్, బుజ్జిబాబు, లక్ష్మయ్య, రామకృష్ణ, బాలరాజు, నాగరాజు, చంటి, కృష్ణ, ప్రసాద్ ,పాపారావు,తదితరులు పాల్గొన్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram