గోల్డెన్ న్యూస్ / నల్గొండ : తప్పుడు వార్తలు రాస్తు, అధికారులను బెదిరింపులకు గురి చేస్తూ, అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న క్రైమ్ మిర్రర్ ఈ-న్యూస్ పేపర్ స్టేట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో అయిన నాగుల ఆనంద్ కుమార్ నీ నల్లగొండ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. సహ-నేరస్తులయిన, తుప్పరి రఘు మరియు పెరబోయిన ఆంజనేయులు ను ఇదివరకే మిర్యాలగూడ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. నల్లగొండ జిల్లా పోలీస్ కార్యాలయం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మిర్యాలగూడ డి.ఎస్.పి రాజశేఖర్ రాజు కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.క్రైమ్ మిర్రర్ డిజిటల్ పేపర్ కు స్టేట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో అయిన నాగుల ఆనంద్ కుమార్ అతని స్నేహితుడు తుప్పరి రఘు, పేరబోయిన ఆంజనేయులు ఒక ముఠాగా ఏర్పడి, నల్లగొండ జిల్లాలోను, మరియు వికారాబాద్, రంగారెడ్డి, కరీంనగర్ జిల్లాల్లోనూ, కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులను, వ్యాపారస్తులను లక్ష్యంగా చేసుకొని, అక్రమ మార్గంలో డబ్బులు సంపాదించాలనే ఉద్దేశ్యంతో, తప్పుడు, సమాచారంతో క్రైమ్ మిర్రర్ డిజిటల్ పత్రికలో ప్రచురించి, అసత్య ప్రచారం చేసి, వారిని బెదిరించి డబ్బులు సంపాదించినారు.సదరు వ్యక్తుల పై ఫిర్యాదు రాగా వారిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు అయ్యింది. నల్లగొండ డి.ఎస్.పి. కె శివరాం రెడ్డి, పరిశోధించి సాక్ష్యాధారాలు సేకరించి, మంగళవారం ప్రధాన నిందితుడు అయిన నాగుల ఆనంద్ కుమార్ ను అతని వద్ద అదుపులోకి తీసుకొని, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకొని రిమాండు కు పంపడం జరిగిందని తెలిపారు. సదరు నేరస్థుడి విచారణలో, వీరిపై మరికొన్ని దురాగతలు వెలుగులోకి రాగా. మిగతా ఇద్దరు నేరస్తులు, మిర్యాలగూడ రూరల్ సీఐ వీరబాబు ను కూడా ఇదే విధంగా వేధించి, భయపెట్టి రెండు లక్షలు డిమాండ్ చేసిన, కేసుకు సంబంధించి, మిర్యాలగూడ టూ టౌన్ లో నమోదు అయిన కేసులో ఇటీవలే అరెస్టు చేసి రిమాండుకు పంపడం జరిగిందని తెలిపారు.