చదవడం లేదని పిల్లలను హత్య చేసి.. తాను ఆత్మహత్య చేసుకున్నాడు.

పిల్లలు పోటీ ప్రపంచంలో రాణించలేకపోతున్నారని సూసైడ్‌ నోట్‌.

గోల్డెన్ న్యూస్ / తాడేపల్లిగూడెం : ప్రపంచంతో పోటీ పడలేకపోతున్నారని కన్న బిడ్డలను అన్న తండ్రి కాలయముడిగా మారాడు. అత్యంత కిరాతకంగా ప్రాణాలు తీశాడు . కాళ్లూ, చేతులను తాళ్లతో కట్టేసి, నీళ్ల బకెట్లలో తలలు ముంచి ఊపిరి ఆడకుండా చేశాడు. అంతటితో ఆగక తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. సొంత ఇల్లు, ప్రభుత్వ ఉద్యోగం, ఉన్నా, ఈ పోటీ ప్రపంచంలో తన పిల్లలు రాణించలేక పోతున్నారని, అందుకే వారిని చంపేసినట్లు సూసైడ్‌ నోట్ లో పేర్కొన్నాడు. ఇందుకు సంబంధించిన  సీఐ పెద్దిరాజు తెలిపిన వివరాల మేరకు, పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడేనికి చెందిన వానపల్లి చంద్రకిశోర్‌ కాకినాడ జిల్లా వాకలపూడిలోని ఓఎన్‌జీసీ కార్యాలయంలో అసిస్టెంట్‌ ఎకౌంటెంట్‌గా పని చేస్తున్నాడు. పట్టణంలోని ఓ ఫ్లాట్‌లో నివాసం ఉంటున్నాడు. అతనికి భార్య తనూజ, ఒకటో తరగతి చదివే జోషిల్‌ (7), యూకేజీ చదివే నిఖిల్‌(6) పిల్లలున్నారు. వారి పిల్లలు సరిగా చదవడం లేదంటూ ఇటీవలే పాఠశాలను మార్పించారు. శుక్రవారం హోలీ సందర్భంగా చంద్రకిశోర్‌ భార్య, పిల్లలను తీసుకుని తమ ఆఫీసులో వేడుకలకు వెళ్లాడు. అనంతరం పిల్లలకు యూనిఫాం కొలతలు తీయించడానికి టైలర్‌ వద్దకు తీసుకెళ్తున్నానని, పది నిమిషాల్లో వస్తానని తన భార్యను అక్కడే ఉండమని చెప్పి వెళ్లాడు. ఎంతసేపటికీ భర్త రాకపోవడం, ఫోన్‌ చేసినా ఎత్తకపోవడంతో తనూజ తోటి ఉద్యోగులతో కలిసి ఇంటికి వెళ్లారు. కిటికీలోంచి చూడగా, భర్త ఫ్యాన్‌కు ఉరి వేసుకుని చనిపోయి ఉన్నాడు. బలవంతంగా తలుపులు తెరిచి చూడగా, పిల్లలిద్దరూ కాళ్లూ చేతులకు కట్లతో నిండా నీళ్లు ఉన్న బకెట్‌లలో తలలు మునిగిపోయి ఉన్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram