ఒకే కాన్పులో నలుగురు పిల్లలకు జన్మనిచ్చిన తల్లి
భోపాల్, మధ్యప్రదేశ్: వైద్య రంగాన్ని ఆశ్చర్యపరిచే విధంగా అరుదైన ఘటన భోపాల్ పట్టణంలో గురువారం చోటుచేసుకుంది. కైలాష్నాథ్ కట్జు ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక మహిళ ఒకేసారి నాలుగురు పిల్లలకు జన్మనిచ్చింది ,ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు . ఈ విశేష ఘటన వారి కుటుంబంలో ఆనందాన్ని నింపింది, అలాగే ఆసుపత్రి సిబ్బందిలో సంతృప్తిని కలిగించింది.
♦ ఏడవ నెలలో అత్యవసర కాన్పు
ఆ మహిళ గర్భధారణ ఏడవ నెలలో ఉండగానే ప్రసవ నొప్పులతో ఆసుపత్రిలో చేరింది. మునుపటి సోనోగ్రఫీ పరీక్షల్లో గర్భంలో నాలుగు పిండాలు ఉన్నట్లు గుర్తించబడింది. నెలలు నిండకముందే ప్రసవించాల్సిన పరిస్థితి ఏర్పడటంతో వైద్యులు సిజేరియన్ చేయాలని తక్షణమే నిర్ణయం తీసుకున్నారు. శస్త్రచికిత్స విజయవంతమై, నలుగురు శిశువులు సురక్షితంగా జన్మించారు.
♦ నవజాత శిశువుల ఆరోగ్య పరిస్థితి
డాక్టర్ స్మితా సక్సేనా తెలిపిన వివరాల ప్రకారం, పిల్లల బరువు 800 గ్రాముల నుంచి 1 కిలోగ్రాముల మధ్యగా ఉంది. వారు అకాలంగా పుట్టినందున, ప్రత్యేక పర్యవేక్షణలో ఉంచబడ్డారు. అందులో ఇద్దరి పరిస్థితి స్థిరంగా ఉన్నా, మిగతా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వారిని నియోనాటల్ ఐసియు (NICU)లో ఉంచి వెచ్చని గదిలో నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. రాబోయే 48 గంటలు చాలా కీలకమైనవని వైద్యులు తెలిపారు.
♦ తల్లి ఆరోగ్యం నిలకడగా ఉంది
శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తికాగా, తల్లి ఆరోగ్యంగా ఉంది. ప్రస్తుతం ఆమె వైద్యుల పర్యవేక్షణలో ఉంది. కుటుంబ సభ్యులు తల్లి మరియు శిశువుల క్షేమం కోసం ఆసుపత్రిలోే ఉండి ప్రార్థనలు చేస్తున్నారు.
♦ అరుదైన ఘట్టం
వైద్య నిపుణులు చెబుతున్నదాని ప్రకారం, ఒకేసారి నలుగురు పిల్లల జననం సహజంగా జరగడం అత్యంత అరుదైన సంఘటన. ఇది సహజ గర్భధారణ ద్వారా జరగడం గమనార్హం – ఎలాంటి సంతానోత్పత్తి చికిత్సలు లేకుండానే సాధ్యమైంది.
ఈ ఘటన భోపాల్లోని ప్రభుత్వ వైద్య రంగానికి ఒక గొప్ప ఘనతగా నిలిచింది. తల్లి ఆరోగ్యం నిలకడగా ఉండటం, పిల్లల కోసం పోరాడుతున్న వైద్యుల కృషి ప్రశంసనీయం..