గోల్డెన్ న్యూస్/ హైదరాబాద్ : వక్ఫ్ బిల్లుపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా మండిపడ్డారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వక్ఫ్ చట్టం రాజ్యాంగ విరుద్ధమని, ఇది ముస్లిం సముదాయ హక్కులను హరించేదిగా ఉందని ఆయన విమర్శించారు. ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఈ నెల 19న దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్లో నిర్వహించే ప్రధాన నిరసన కార్యక్రమంలో ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ప్రతినిధులు పాల్గొననున్నారని తెలిపారు.
♦ వక్ఫ్ ఆస్తుల వినాశనమే లక్ష్యం
ఈ చట్టం వక్ఫ్ ఆస్తులను నాశనం చేయాలనే దురుద్దేశంతోనే తీసుకొచ్చారని, అసదుద్దీన్ ఆరోపించారు. వక్ఫ్ అంటే నా దృష్టిలో అది ప్రార్థనా స్థలం అని పేర్కొంటూ, ముస్లిమేతరులను వక్ఫ్ బోర్డులో సభ్యులుగా చేర్చడం చట్టబద్ధంగా కాదని అన్నారు. ఇది ముస్లింల మనోభావాలను కించపరిచే చర్య అని పేర్కొన్నారు.
♦ నితీష్, చంద్రబాబు, బిల్లుకు మద్దతు హేయం
వక్ఫ్ బిల్లుకు చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ లాంటి నేతలు మద్దతు తెలపడం విచారకరమని అసదుద్దీన్ తెలిపారు. మోదీ ప్రభుత్వం ముస్లింలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని, ఈ బిల్లుతో భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 26కు విఘాతం కలుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
♦ బిజెపి అసత్య ప్రచారం చేస్తోంది.
వక్ఫ్పై బీజేపీ చేస్తున్న అన్ని ప్రచారాలు అబద్ధమని అసదుద్దీన్ అన్నారు. వాస్తవానికి వక్ఫ్ బిల్లుతో ముస్లింలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని చెప్పారు. మోదీ సర్కార్ మరోసారి వక్ఫ్ బిల్లుపై పునఃసమీక్ష చేయాలని, ముస్లిం సముదాయ హక్కులను కాపాడాలని డిమాండ్ చేశారు.
♦ ఈ విషయంపై ముస్లింలు మౌనంగా ఉండరు.
ఈ బిల్లును వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ముస్లింలు సంఘటితంగా పోరాడాల్సిన అవసరం ఉందని, ముస్లింలు మౌనంగా ఉండరని అసదుద్దీన్ స్పష్టం చేశారు. వక్ఫ్ ఆస్తులు ముస్లిం సమాజానికి చెందినవే అని, వాటిపై హక్కు ముస్లింలకే ఉందని తేల్చి చెప్పారు.
Post Views: 24