ఇద్దరు పిల్లలను వాగులోకి తోసి.. తాను దూకేసిన తల్లి..

  తల్లి క్షేమం …ఇద్దరు పిల్లలు మృతి.

గోల్డెన్ న్యూస్ /మెదక్‌ : తూప్రాన్‌ మండలం ఇస్లాంపూర్‌  సోమవారం విషాద సంఘటన చోటు చేసుకుంది. ఓ కుటుంబం ఆర్థిక బాధలు వేదించడంతో మనస్థాపం చెందిన ఓ తల్లి తన ఇద్దరు పసిపిల్లలతో కలిసి ఆత్మహత్యకు పాల్పడింది. కానీ చివరి క్షణంలో  తాను పశ్చాత్తాపడి వారిని కాపాడేందుకు చేసిన ప్రయత్నం విఫలమైంది.

 

శివ్వంపేట మండలం దంతాన్‌పల్లికి చెందిన వడ్డేపల్లి మమత చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయి తన చిన్నమ్మ మైసమ్మ వద్ద పెరిగింది. మాసాయిపేటకు చెందిన స్వామితో మమత వివాహం జరిగింది, వీరికి పూజ (7), తేజస్విని (5) అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అనారోగ్యంతో భర్త స్వామి రెండేళ్ల క్రితం మృతిచెందాడు. భర్త మృతితో మమత ఒంటరి అయిపోయింది. ఆర్థికంగా కూడా తీవ్రమైన ఇబ్బందులు ఎదురయ్యాయి. పిల్లల పోషణ భారంగా మారింది. ఈ పరిస్థితుల్లో మమత తీవ్ర మానసిక దుస్థితికి లోనైంది.

 

ఆత్మహత్యే శరణ్యం అని  భావించిన మమత సోమవారం ఉదయం తన ఇద్దరు పిల్లల్ని తీసుకొని ఇస్లాంపూర్‌ శివారులో ఉన్న హల్దీవాగు వద్దకు వెళ్లింది. అక్కడ నిశ్చలంగా పిల్లలను వాగులో తోసేసింది. ఆ వెంటనే తానూ వాగులో దూకింది. కానీ నీటిలోకి దూకిన వెంటనే తన పిల్లల మీద ప్రేమ, బతుకుదెరువు ఆశ కలగజేసాయి. వెంటనే ఒడ్డుకు చేరి తన చీరను విప్పి పిల్లల వైపు విసిరి రక్షించేందుకు ప్రయత్నించింది. అయితే అప్పటికే పిల్లలు నీటిలో మునిగి పోయారు. ఆమె గట్టిగా కేకలు వేస్తూ స్థానికుల దృష్టికి ఈ ఘటనను తీసుకొచ్చింది.

 

స్థానికుల సమాచారంతో తూప్రాన్‌ ఎస్సై శివానందం నేతృత్వంలో పోలీసులు హల్దీవాగులో గాలింపు చర్యలు చేపట్టి పూజ, తేజస్వినిల మృతదేహాలను వెలికితీశారు. ఈ సంఘటనపై ఇంకా ఎలాంటి అధికారిక ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. అయినప్పటికీ, ఇద్దరు చిన్నారులను నీటిలో తోసిన కారణంగా మమతపై చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశముందని తెలుస్తోంది.

 

ఈ ఘటన కుటుంబ వ్యవస్థలో మహిళలు ఎదుర్కొంటున్న ఒత్తిడి, ఆర్థిక అసమతుల్యత, మానసిక ఆరోగ్యాన్ని గూర్చిన ఎన్నో ప్రశ్నలకు నిదర్శనం. నిస్సహాయ స్థితిలో తీసుకున్న ఓ తల్లి నిర్ణయం, రెండు పసిపిల్లల అమూల్య ప్రాణాలను బలితీసుకుంది. ఈ ఘటనను సమాజం మానవతా దృక్పథంతో ఆలోచించాల్సిన అవసరం ఉంది..

 

 

Facebook
WhatsApp
Twitter
Telegram