అర్హులైన జర్నలిస్టులకు ఇల్లు మంజూరు చేస్థాం. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
గోల్డెన్ న్యూస్/ హైదరాబాద్ : రాష్ట్రంలోని జర్నలిస్టులకు రెవెన్యూ శాఖ మంత్రి శ్రీనివాస్ రెడ్డి శుభవార్త చెప్పారు. అర్హులైన జర్నలిస్టులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లో నిరుపేదలైన జర్నలిస్టులు, అలాగే వృత్తి నిర్వహణలో మృతి చెందిన జర్నలిస్టుల కుటుంబాలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
వృత్తి నిర్వహణలో చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలకు నెలసరి పెన్షన్, తీవ్ర అనారోగ్యం, ప్రమాదాలకు గురై వృత్తి నిర్వహించలేని స్థితిలో ఉన్న జర్నలిస్టులకు మంత్రి శుక్రవారం నాంపల్లి లోని ప్రెస్ అకాడమీ కార్యాలయంలో చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మండల, నియోజకవర్గ స్థాయిలో పని చేస్తున్న జర్నలిస్టులను ఆదుకోవడానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. నిజాన్ని నిర్భయంగా సమాజానికి తెలియజేసే విషయంలో ఎంతోమంది జర్నలిస్టులు ధర్మాన్ని పాటిస్తున్నారన్నారు . జర్నలిస్టు వృత్తిని నమ్ముకుని తమ జీవితం మొత్తం ఆ వృత్తికే అంకితం అయినవాళ్ళు ఎంతోమంది ఉన్నారని అన్నారు.విడతల వారీగా రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన రూ.42 కోట్లను ఫిక్స్డ్ డిపాజిట్ చేసి, దానిపై వచ్చే వడ్డీని జర్నలిస్టుల సంక్షేమం కోసం అకాడమి ఖర్చు పెడుతుందని, జర్నలిస్టుల సంక్షేమానికి ఫిక్స్డ్ డిపాజిట్ పై వచ్చిన వడ్డీ ఆధారంగా ఇప్పటివరకు రూ.22 కోట్లు ఖర్చు చేయడం జరిగిందన్నారు