ఒకేసారి మూడు నెలల రేషన్… రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం..

గోల్డెన్ న్యూస్  / హైదరాబాద్‌ : వర్షాకాలంలో తిండి గింజల నిల్వ, రవాణాలో అంతరాయాలు తలెత్తే అవకాశం ఉన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది.

 

జూన్‌ నుంచి మొదలయ్యే వర్షాకాలం, వరదల వంటివి రాష్ట్రాలకు అడ్డంకులుగా మారవచ్చన్న అంచనాల నేపథ్యంలో, అన్ని రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలు జాతీయ ఆహార భద్రత చట్టం కింద ఆగస్టు 2025 వరకు అవసరమైన తిండి ధాన్యాలను ముందస్తుగానే లిఫ్టింగ్‌ చేసి, పంపిణీ చేయాలని స్పష్టం చేసింది. మూడు నెలల కోటాను ఒకేసారి పంపిణీ చేయాలని నిర్ణయించింది.

 

ఈ మేరకు అన్ని రాష్ట్రాల పౌరసరఫరాల శాఖ ముఖ్య కార్యదర్శులకు కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ రాహుల్‌ సింగ్‌ లేఖ రాశారు. మే 30లోగా జూన్, జూలై, ఆగస్టు నెలలకు సంబంధించిన సరకును లబ్ధిదారులకు అందించాలని పేర్కొన్నారు. ముందస్తు బియ్యం లిఫ్టింగ్, పంపిణీ ప్రక్రియలో భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) గోడౌన్లలో తగినంత నిల్వలు ఉండేలా చూసుకోవాలని, రాష్ట్ర ప్రభుత్వా లతో సమన్వయం చేసుకుని అవసరమైన చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశించారు. ఈ ఉత్త ర్వులు సంబంధిత అధికారుల అనుమతి మేరకు తక్షణం అమల్లోకి వస్తాయన్నారు.

 

రాష్ట్రంలో జూన్‌లోనే 3 నెలల సరఫరా

ఏప్రిల్‌ కోటా రేషన్‌ బియ్యం పంపిణీ ప్రక్రియ పూర్తవుతున్న నేపథ్యంలో వచ్చే జూన్‌లో మూడు నెలల కోటాను విడుదల చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి తెలియజేసినట్లు సమాచారం. ప్రతినెలా 1.75 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యం అవసరమైన నేపథ్యంలో మూడు నెలలకు సంబంధించి సుమారు 5 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యం అవసరం. రాష్ట్రంలో సన్నబియ్యం పంపిణీ చేస్తున్న కారణంగా గోడౌన్‌ల నుంచి సన్న బియ్యం నిల్వలను సమీకరించి వచ్చే నెలలో మూడు నెలల రేషన్‌ కోటాను విడుదల చేసేందుకు పౌర సరఫరాల శాఖ సన్నాహాలు చేస్తోంది.

Facebook
WhatsApp
Twitter
Telegram