గోల్డెన్ న్యూస్ / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు కొత్తగూడెం సబ్ డివిజన్ పోలీసులు కొత్తగూడెం డిఎస్పి రెహమాన్ ఆధ్వర్యంలో మండల పరిధిలోని మాచిన పేట గురువారం కమ్యూనిటీ కనెక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. ఇందులో భాగంగా గ్రామంలోని పాలు ఇండ్లలో సోదాలు నిర్వహించడం జరిగింది. పోలీసులు నిర్వహించిన సోదాలలో సుమారుగా 4,000/- ల రూపాయల విలువ గల గుడుంబాను, 15,000/- రూపాయల విలువ గల మద్యం బాటిళ్లను, 3500/- రూపాయల విలువ గల గుట్కాలను సీజ్ చేయడం జరిగిందని డిఎస్పీ వెల్లడించారు. సరిగ్గా పత్రాలు లేని 65 వాహనాలకు 8900/- రూపాయల జరిమానాను విధించడం జరిగిందన్నారు. అదేవిధంగా గంజాయి వంటి ప్రభుత్వం నిషేధిత పదార్థాలను కనుగొనడానికి నార్కోటిక్ డాగ్స్ ద్వారా సోదాలని నిర్వహించడం జరిగిందని తెలిపారు. అనంతరం గ్రామస్తులతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చట్టవ్యతిరేక మరియు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తుల గురించి సమాచారం తెలిస్తే వెంటనే పోలీసు వారికి సమాచారం అందించాలని కోరారు. తమ ప్రాంతంలో ఎలాంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకువస్తే సంబంధిత అధికారులతో మాట్లాడి వాటి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. మట్కా, జూదం, బెట్టింగ్, గంజాయి రవాణా వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇట్టి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తుల సమాచారం తెలిపిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో సుమారుగా 100 మంది పోలీస్ అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు