గోల్డెన్ న్యూస్ / ఆదిలాబాద్ : ట్రిపుల్ ఐటీలో సీటు రాలేదని మనస్థాపనతో విద్యార్థిని ఉరేసుకొని ఆత్మమహత్య పాల్పడ్డ విషాద ఘటన ఆదిలాబాద్ జిల్లాలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే ఆదిలాబాద్ జిల్లా భోథ్ మండలం దన్నూర్ గ్రామానికి చెందిన మనిమెల శైలజ అనే విద్యార్థిని 10వ తరగతిలో 563 మార్కులు సాధించి మండల టాపర్ గా నిలిచింది. ఆ తర్వాత బాసర ట్రిపుల్ ఐటీలో చదువుకోవడానికి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయగా.. ఆమెకు సీటు రాలేదు. దీంతో తీవ్ర మనస్థాపం చెందిన శైలజ ఇంట్లో ఎవరూ లేని సమయంలో చూసి ఫ్యాన్ కి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. అయితే చనిపోయే ముందు.. తనకు ట్రిపుల్ ఐటీలో సీటు రాలేదని, ఎంపీసీలో చేరతానని ఫోన్ చేసి చెప్పిందని ఆమె స్నేహితులు చెబుతున్నారు. కానీ, ఇంతలోనే ఇలా సూసైడ్ చేసుకొని చనిపోవడం చాలా బాధించిందని శైలజ ఫ్రెండ్స్, ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేతికందిన కూతురు ప్రాణాలు తీసుకోవడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
ఈ మధ్య కాలం విద్యార్థులు ఆత్మహత్యలు పెరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. పరీక్షలో ఫెయిల్ అయ్యామని, టీచర్ తిట్టిందని, మార్కులు తక్కువగా వచ్చాయని.. ఇలా చిన్న చిన్న విషయాలకు మనస్తాపంతో ప్రాణాలు తీసుకుంటున్నారు విద్యార్థులు. ఓవైపు మంచి మార్కులు సాధించాలనే ఒత్తిడి, మరోవైపు పోటీ పరీక్షల భారం, పాఠ్యాంశాలను అర్థం చేసుకోలేకపోవడంతో మానసిక ఒత్తిడి పెరిగి ఆత్మహత్యలు చేసుకునే వరకు వెళ్తున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల పై భారీ అంచనాలను పెట్టుకోవడం కూడా విద్యార్థులు ఆత్మహత్యలకు ఒక కారణమని తెలుస్తోంది. తల్లిదండ్రుల అంచనాలను రీచ్ అవ్వలేమని తెలిసినప్పుడు మనస్థాపానికి గురై ప్రాణాలు తీసుకుంటున్నారు కొందరు విద్యార్థులు .