గోల్డెన్ న్యూస్ /హైదరాబాద్ : తన స్వార్థం కోసం అందర్నీ అడ్డగోలుగా వాడేసుకుంది నమ్రత. కాసులకు కక్కుర్తిపడి కొందరు, తెలియకుండా మరికొందరు కేసులో ఇరుక్కున్నారు. వీరంతా ఎంతోమంది చిన్నారులను తల్లి ఒడికి దూరం చేశారు. సరోగసీ ఎరవేసి ఎందరో దంపతులను మనోవేదనకు గురిచేశారు. అనస్తీసియా, గైనాకాలజీ డాక్టర్లు, ANMలు వీరంతా క్రిమినల్సే. మరి ఎవరెవరు.. ఏ స్థాయిలో ఇరుక్కున్నారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే !
అద్దెగర్భం ముసుగులో యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ నిర్వాహకులు చేసిన అకృత్యాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తాను చేసిన పాపాల్లో చాలా మంది డాక్టర్స్ని భాగస్వామ్యం చేసింది నమ్రత. ఈ కేసులో తాజాగా వెలుగులోకి వచ్చిన మరో కొత్త విషయం ఏమిటంటే, నమ్రత సికింద్రాబాద్కు చెందిన ఒక ప్రముఖ గైనకాలజిస్ట్కు తెలియకుండానే ఆమె లెటర్హెడ్లను ఉపయోగించింది. ఆ డాక్టర్ పేరు మీద నమ్రత పలువురికి ఇంజెక్షన్లు, మందులు ఇచ్చినట్లు పోలీసులు గుర్తించారు. తన పేరుతో ఉన్న లెటర్ హెడ్ చూసి గైనకాలజిస్ట్ ఆశ్చర్యానికి గురయ్యారు. నమ్రతపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆమె ఫిర్యాదు చేశారు. ఇలా తన స్వార్థం కోసం అందర్నీ అడ్డగోలుగా వాడేసింది నమ్రత. కొంతమంది డాక్టర్స్ నమ్రత విసిరే కాసులకు కక్కుర్తి పడి కేసుల్లో ఇరుక్కుంటే.. మరికొందరు డాక్టర్లను తన స్వార్థం కోసం వాడుకొని బుక్ చేసింది.
ఇప్పటికే సృష్టి ఫెర్టిలిటీ కేసులో పలువురు డాక్టర్స్ అరెస్ట్ అయ్యారు. ఈ కేసులో గోపాలపురం పోలీసులు అరెస్ట్ చేసిన 8 మందిలో డాక్టర్స్ కూడా ఉన్నారు. రవి ఇతను అనస్థీషియా డాక్టర్. రమ్య విశాఖలో పనిచేస్తున్న డాక్టర్, అనుశ్రీ ఇమే కూడా ఓ డాక్టరే. అంతకంటే ముందు డాక్టర్ విద్యుల్లతను అరెస్ట్ చేశారు పోలీసులు. సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ పర్మిషన్లు కూడా విద్యుల్లత పేరు మీదనే తీసుకున్నట్లు గుర్తించారు. గాంధీ ఆస్పత్రిలో అనస్థీషియా డాక్టర్గా కొనసాగుతున్న సదానందానికి కూడా ఈ కేసులో కీలకపాత్ర ఉంది. ప్రతీ ఆపరేషన్ వెనక డాక్టర్ సదానందం పాత్ర ఉన్నట్లు తేలింది.
అనస్తీసియా, గైనాకాలజీ డాక్టర్లు, ANMలు, ఏజెంట్లు, ఆశా వర్కర్లు ఇలా మొత్తం 22 మందిని నమ్రత క్రిమినల్స్గా మార్చేసింది. వీరంతా నమ్రత ఇచ్చే డబ్బులకు ఆశ పడి.. ఎంతోమంది చిన్నారులను తల్లి ఒడికి దూరం చేశారు. సరోగసీ ఎరవేసి ఎందరో దంపతులను మనోవేధనకు గురి చేశారు. కాసుల కక్కుర్తితో అడ్డదారి తొక్కారు. తల్లి పిల్లల్ని వేరు చేస్తున్నామనే మానవత్వం మరిచారు. తప్పొప్పుల విచక్షణ గాలికొదిలేసి సంతానలేమిని సొమ్ము చేసుకునేందుకు ఎన్నో అక్రమాలకు తెరలేపారు. పోలీసులు దర్యాప్తులో వెలుగుచూస్తున్న కొత్త విషయాలు ప్రస్తుతం ఉలికిపాటుకు గురిచేస్తున్నాయి. ఇన్నేళ్లుగా సరోగసీ ముసుగులో బాధితులకు అందజేసిన శిశువులను ఎక్కడ నుంచి తీసుకొచ్చారు? ఎంతమందికి ఇచ్చారనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.