వచ్చే నెల నుంచి బ్యాగుల్లో రేషన్ బియ్యం?
గోల్డెన్ న్యూస్/హైదరాబాద్ : వచ్చే నెల నుంచి రేషన్ బియ్యం కోసం ఇంటి నుంచి బ్యాగులు తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రభుత్వమే పర్యావరణహిత బ్యాగులను అందజేయబోతోంది. వచ్చే నెలలో అందజేసే వీటిని ప్రతినెలా బియ్యం కోసం తీసుకెళ్తే సరిపోతుంది. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతుంది. రాష్ట్రంలోని రేషన్ కార్డుదారులకి శుభవార్త చెప్పబోతుందని సమాచారం. మూడు నెలల రేషన్ ఒకేసారి పంపిణీ చేశారు కనుక.. ఆగస్టు వరకు రాష్ట్రంలో రేషన్ పంపిణీ ఆగిపోయింది. వచ్చె నెల అనగా సెప్టెంబర్ నుండి రేషన్ పంపిణీ తిరిగి ప్రారంభం కాబోతుంది.
ఈ క్రమంలో రేషన్ తీసుకునే వారికి ఉచితంగా రేషన్ బ్యాగులను ఇవ్వనుంది. ఈ బ్యాగుల్లో సన్న బియ్యంతో పాటు, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల వివరాలు కూడా ఉంటాయని తెలుస్తోంది. ఇప్పటికే ఈ బ్యాగులు రాష్ట్రంలోని అన్ని రేషన్ డిపోలకు చేరాయని అధికారులు తెలిపారు.
సెప్టెంబర్ నెల నుంచి రాష్ట్రంలోరేషన్ తీసుకునే వారికి సన్న బియ్యంతో పాటు ఈ ప్రత్యేకమైన బ్యాగులను ఉచితంగా ఇవ్వనున్నారు. ఈ బ్యాగును బయట కొనాలంటే రూ.50 వరకు ఉంటుంది. ఈ బ్యాగులపై సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కల ఫొటోలతో పాటుగా..
రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫొటో కూడా ఉంటుంది. అలానే ఈ బ్యాగు మీద ఇందిరమ్మ అభయ హస్తం పేరుతో ఆరు గ్యారంటీలకు సంబంధించిన వివరాలను కూడా ముద్రించారు.









