గోల్డెన్ న్యూస్ /పినపాక : నీటిలో జీవించే రకరకాల జీవరాశులలో అరుదైన జలచరాలు ఎన్నో ఉన్నాయి. అవి తీరానికి సమీపంగా వచ్చినప్పుడు లేక జాలర్ల వలలకు చిక్కినప్పుడు వాటిని వింతగా కొత్తగా చూడటం జరుగుతుంది. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం చింతల బయ్యారం జాలర్లకు వింత చేప చిక్కిన ఘటన గురువారం చోటుచేసుకుంది. గోదావరి వరద పెరగడంతో గోదావరి పోటు ప్రాంతం చింతల బయ్యారంలో చేపలు పడుతుండగా ఓ వింత చేప జాలర్లకు చిక్కింది. జాలర్లు తెలిపిన వివరాల ప్రకారం చింతల బయ్యారం కుంటలో చేపలు పట్టడానికి ప్రయత్నించగా ఆ చేపలతో పాటు ఈ వింత చేప లభించిందని తెలిపారు. మామూలు చేపలకు భిన్నంగా నోరు, రంగు, శరీరం మొత్తం ముల్లులు ఉండటంతో ఆ చేపగురించి ప్రజలు రకరకాలుగా చెప్పుకుంటున్నారు. ఆ చేప ఏ రకానికి చెందిందని తమకు తెలియదన్నారు. దీంతో గ్రామస్తులు ఆ చేపను ఆసక్తిగా చూస్తున్నారు.









