కవితపై వేటు.. సంతోషిస్తున్న మహిళలు: సత్యవతి రాథోడ్

తెలంగాణ జాగృతి అధినేత్రి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సస్పెన్షన్ వేటు వేయడంపై ఆ పార్టీలోని సీనియర్ నేతలు స్వాగతిస్తున్నారు. ఈ సందర్బంగా ఆ పార్టీ నేతలు మాట్లాడుతూ.. మూడు నెలలుగా కవిత చేస్తున్న ఆరోపణలపై తమ పార్టీ అధినేత కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. తమ పార్టీ నాయకుడు తీసుకున్న ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని స్పష్టం చేశారు. ఆయన నిర్ణయానికి తాము మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించారు. కవితను సస్పెండ్ చేయడంతో మహిళలు ఎక్కువగా సంతోషిస్తున్నారని పేర్కొన్నారు. కవిత తీరు బీఆర్ఎస్ కార్యకర్తల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని చెప్పారు.

 

సోమవారం కవిత చేసిన వ్యాఖలతో కేసీఆర్ చాలా బాధపడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. నష్టాన్ని నివారించడం కోసం కార్యకర్తలకు మనో ధైర్యం ఇవ్వడం కోసం కవితని సస్పెండ్ చేశారని వివరించారు. పార్టీకి నష్టం చేస్తే సొంత కుటుంబ సభ్యులపైన కూడా చర్యలు తీసుకుంటానని కేసీఆర్ గతంలో చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా సత్యవతి రాథోడ్ గుర్తు చేశారు. కోట్ల మంది పార్టీ కార్యకర్తల కంటే పేగు బంధం ఎక్కువ కాదంటూ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. తాము ఎన్నిసార్లు చెప్పినా కవిత.. తన వైఖరిని మాత్రం మార్చుకోలేదన్నారు. పార్టీ కంటే ఎవరు పెద్ద కాదని చెప్పారు. కవిత మాటలు పార్టీ నేతలను మనోవేదనకు గురిచేశాయని చెప్పారు.

 

కవిత వెనుక ఎవరో ఉండి మాట్లాడుతున్నారంటూ సందేహం వ్యక్తం చేశారు. తమ నాయకుడి బిడ్డగా కవితంటే తమకు గౌరవం ఉందన్నారు. కానీ ఆమెకు దక్కిన గౌరవాన్ని కాపాడుకో లేక పోయిందని విచారం వ్యక్తం చేశారు. పార్టీ ఉంటే ఎంత పోతే అనడం ఏంటంటూ ప్రశ్నించారు. మరి నువ్వు ఉంటే ఏంటి? పోతే ఏంటి? అంటూ కవితకు సత్యవతి రాథోడ్ చురకలంటించారు. బిఆర్ఎస్‌ను బీజేపీలో విలీనం చేస్తానంటే తానే వద్దనట్లు కవిత చెప్పారని.. అలాంటి ఆమె మీద కేసీఆర్‌కు ఎంత ప్రేమ ఉందో తెలుస్తుందని చెప్పారు.

 

కవిత తనకు తానే గొయ్యి తీసుకుంది..

 

ఎమ్మెల్సీ కవిత తనకు తానే గొయ్యి తీసుకుందని గొంగిడి సునీత స్పష్టం చేశారు. కేసీఆర్‌ను గౌరవించినట్లే కవితను సైతం తెలంగాణ సమాజం గౌరవించిందని గుర్తు చేశారు. బిఆర్ఎస్ ఉంది కాబట్టే కవితకు ఎంపీగా, ఎమ్మెల్సీగా పోటీ చేసేందుకు బిఫాం ఇచ్చారన్నారు. అది మరిచి పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అంటారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. క్షేత్ర స్థాయిలో అడుగు పెట్టీ చూడండంటూ కవితకు గొంగడి సునీత సూచించారు. నిన్ను నిలదీసేందుకు సిద్ధంగా ప్రజలు ఉన్నారని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ నీకు నచ్చక పోవచ్చు.. కానీ తెలంగాణ సమాజం మాత్రం బీఆర్ఎస్ పార్టీని కోరుకుంటుదన్నారు. బీఆర్ఎస్ పార్టీకి ద్రోహం చేసిన వారిలో మీరు ఒకరిగా మిగలాలంటే తాము చేసేది ఏమిలేదని గొంగడి సునీత పేర్కొన్నారు.

 

కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం: మాలోతు కవిత

 

బీఆర్ఎస్ పార్టీలోని సీనియర్ నేతలు హరీష్ రావు, సంతోష్‌లపై కవిత చేసిన వ్యాఖ్యలు తనను బాధించాయన్నారు. ఈ పార్టీని నమ్ముకుి ఎంతో మంది ఉన్నారని చెప్పారు. అలాంటి పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అంటే బాధేసిందని చెప్పారు. పేగు బంధం కంటే పార్టీ బంధం గొప్పదని కేసీఆర్ నిర్ణయించారని తెలిపారు. కేసీఆర్ నిర్ణయాన్ని తాను స్వాగతిస్తున్నానని స్పష్టం చేశారు..

Facebook
WhatsApp
Twitter
Telegram