రైతుల ఆధార్‌ ఆధారంగా ఎరువుల సరఫరా చేయాలి – కలెక్టర్లకు సీఎం ఆదేశం

ఎరువుల లభ్యత, సరఫరా అంశంపై అధికారులతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్‌ – ఎరువుల సరఫరాని క్షేత్రస్థాయిలో పరిశీలించాలని కలెక్టర్లకు ఆదేశం

 

గోల్డెన్ న్యూస్ / అమరావతి : ఎరువుల సరఫరా తీరుతెన్నులను క్షేత్రస్థాయికి వెళ్లి స్వయంగా పర్యవేక్షించాలని కలెక్టర్లను సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఎరువుల సరఫరాపై రైతుల్లో ఉన్న అనుమానాలు, ఆందోళన తొలగించాలని నిర్దేశించారు. వచ్చే రబీలో వెబ్‌ ల్యాండ్‌ – ఈ పంట అనుసంధానంతో రైతుల ఆధార్‌ ఆధారంగా ఎరువుల సరఫరా చేపట్టాలని సూచించారు.

 

ఎరువుల లభ్యత, సరఫరాపై కలెక్టర్లు, ఎస్పీలు, వ్యవసాయ శాఖ అధికారులతో సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఎరువుల సరఫరాపై రైతుల నుంచి నేరుగా తాను తెప్పించుకున్న ఫీడ్‌ బ్యాక్‌ ఆధారంగా సమీక్ష జరిపారు. జిల్లాల నుంచి తెప్పించుకున్న సమాచారాన్ని అధికారులు ఇచ్చిన సమాచాచంతో పోల్చి చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లాల్లో ఎంతెంత ఎరువులు అందుబాటులో ఉన్నాయి, డిమాండ్‌ ఎలా ఉంది అనే విషయాలను కలెక్టర్లు సీఎంకు వివరించారు. ఎరువుల సరఫరా సక్రమంగా జరుగుతోందని రైతులకు డిమాండ్‌ మేరకు అందుతున్నాయని అధికారులు చెప్పారు. అన్ని జిల్లాల్లో కలిపి 77,396 మెట్రిక్‌ టన్నుల ఎరువులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు

 

రాష్ట్రానికి అదనంగా 41,000 టన్నులు: ఎరువులు కాకినాడ పోర్టుకు రేపు ఒక వెజల్‌ వస్తుందని దాని నుంచి 15000 మెట్రిక్‌ టన్నుల ఎరువులు అందుబాటులోకి వస్తాయని అన్నారు. మరో 10 రోజుల్లో 41 వేల టన్నుల ఎరువులు రాష్ట్రానికి అదనంగా రానున్నాయని అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. బాపట్ల, కృష్ణా, కడప జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో ఎరువుల కొరత ఉందని ఈ సమస్య పరిష్కరించేందుకు ఇతర ప్రాంతాల నుంచి తెప్పిస్తున్నామని చెప్పారు. ఆ సమస్యని కూడా సత్వరమే పరిష్కరించాలని సీఎం ఆదేశించారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల నుంచి జిల్లా కలెక్టర్‌ వరకు క్షేత్రస్థాయిలో పర్యటించి ఎరువుల సరఫరాని పరిశీలించాలని నిర్దేశించారు. ఎరువుల లభ్యత గురించి రైతులకు వివరించి వారు ఎలాంటి ఆందోళన చెందకుండా చూడాలని సూచించారు

Facebook
WhatsApp
Twitter
Telegram