కులం నుంచి వెలి వేశారు.

 – పెన్నాడ గ్రామానికి చెందిన 28 మంది ఆవేదన

– పంచాయతీ కార్యాలయం వద్ద ధర్నా

ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఘటన

గోల్డెన్ న్యూస్ /పాలకోడేరు : తమ కులానికి చెందిన పెద్దలు తమను వెలి వేశారంటూ పెన్నాడ గ్రామానికి చెందిన కొంతమంది పంచాయతీ కార్యాలయం వద్ద శుక్రవారం ధర్నా నిర్వహించారు. సుమారు 28 మందిని కులం నుంచి వెలి వేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై బాధితులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. శెట్టిబలిజ పెద్దలు దొమ్మేటి వేణుగోపాలం, పంపన వెంకటేశ్వరరావు, పాల శేషు, గుత్తుల కొండలరావు, జక్కంశెట్టి బాలమురళీకృష్ణ, చింతపల్లి రామకృష్ణ మాట వినడం లేదంటూ మూడేళ్ల క్రితం కొంత మందిని, ఏడాది క్రితం మరి కొంతమందిని, ఏడు నెలల క్రితం కొంతమందిని మొత్తం 28 మందిని కులం నుంచి వెలి వేశారు. ప్రేమ పెళ్లి విషయంలోనూ, స్థలం అమ్మకం విషయంలోనూ, డ్రెయినేజీ నిర్మాణ విషయంలోనూ ఇలా మమ్మల్ని బహిష్కరించినట్లు దొంగ నాగలక్ష్మి, దొమ్మేటి వెంకటేశ్వరరావు, పి.సురేష్‌, గుత్తుల నాగరాజు, జక్కంశెట్టి సత్య నాగరాజు, సిహెచ్‌.సుబ్రహ్మణ్యం, చింతపల్లి శివప్రసాద్‌, గుత్తుల శ్రీనివాస్‌, చీరబోయిన శ్రీనివాసరావు, బొక్కా రమేష్‌, పంపన రవి తెలిపారు. అప్పటి నుంచి శుభకార్యాలకు పిలవడం లేదని, ఇళ్లకు వచ్చిన చుట్టాలను కూడా అవమానిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పంచాయతీ వద్ద ఆందోళన చేస్తున్నారన్న విషయాన్ని తెలుసుకున్న భీమవరం రూరల్‌ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ బి.శ్రీనివాస్‌, పాలకోడేరు ఎస్ఐ రవివర్మ, పంచాయతీ కార్యదర్శి కె.వెంకటరాజు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ రాఘవ రాజు, విఆర్ఒ సుబ్రహ్మణ్యం స్థానిక పంచాయతీ కార్యాలయంలో బాధితులను విచారించారు. అయితే అవతలి వారు అందుబాటులో లేకపోవడంతో విచారణ రేపటికి వాయిదా వేశారు.

Facebook
WhatsApp
Twitter
Telegram