గోల్డెన్ న్యూస్/ వెబ్ డెస్క్ : ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో ఒకే రోజు వంద మందికి పైగా మావోయిస్టులు లొంగిపోయారు. జిల్లా ఎస్పీ జితేంద్ర యాదవ్ మీడియాకు వెల్లడించిన వివరాల మేరకు, మొత్తం 103మంది మావోయిస్టులు లొంగుబాటు చేసినట్లు తెలిపారు. వీరిలో 49మందిపై రూ.1 కోటి వరకు రివార్డు ఉన్నట్టు పేర్కొన్నారు..
లొంగిపోయిన వారిలో 22 మంది మహిళలు కూడా ఉండటం విశేషం. మావోయిస్టు భావజాలంపై పెరుగుతున్న అసంతృప్తి, అంతర్గత విభేదాలు, పోలీసుల వ్యూహాలు, అలాగే అభివృద్ధి పనులపై నమ్మకం పెరగడం ఈ లొంగుబాటుకు ప్రధాన కారణ మణి ఎస్పీ తెలిపారు.
ప్రభుత్వ ప్రోత్సాహం
లొంగిపోయిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం రూ.50 వేలు చొప్పున తక్షణ సహాయం అందజేసింది. తదుపరి పునరావాస పథకాల కింద విద్య, ఉపాధి, గృహ సౌకర్యాలు వంటి సదుపాయాలు కల్పించనున్నట్టు అధికారులు స్పష్టం చేశారు.
ఒకే రోజులో ఇంత పెద్ద ఎత్తున మావోయిస్టులు లొంగిపోవడం ఈ జిల్లాలోనే కాకుండా రాష్ట్ర చరిత్రలోనూ ఇదే మొదటిసారి. ఈ పరిణామం భవిష్యత్తులో మరింత మంది నక్సలైట్లు హింసా మార్గాన్ని వదిలి, సాధారణ జీవితాన్ని ఎంచుకునే అవకాశాలు ఉన్నాయని పోలీసు ఉన్నతాధికారులు అభిప్రాయపడ్డారు.










