చెక్కు బౌన్స్ కేసులో వ్యక్తికి ఆరు నెలల జైలు శిక్ష – రూ.8 లక్షల పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశం
గోల్డెన్ న్యూస్ /మణుగూరు : చెక్కు బౌన్స్ కేసులో ముద్దాయికి ఆరు నెలల జైలు శిక్షతో పాటు రూ.8 లక్షల పరిహారం చెల్లించాలని మణుగూరు ప్రథమ శ్రేణి జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కంబపు సూరి రెడ్డి సోమవారం తీర్పు వెలువరించారు.
వివరాల్లోకి ఇలా..
మణుగూరు మండలం అశోక్నగర్కు చెందిన గారపాటి సత్యనారాయణ, అదే ప్రాంతానికి చెందిన మంచాల అంజయ్య వద్ద రూ.8 లక్షలు రుణంగా తీసుకున్నారు. రుణం చెల్లించేందుకు 2019లో ఇచ్చిన చెక్కు బ్యాంకులో సరిపడా నిధులు లేక బౌన్స్ అయింది.
తర్వాత అంజయ్య నోటీసు పంపినా సత్యనారాయణ స్పందించకపోవడంతో కోర్టును ఆశ్రయించారు. విచారణలో సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయమూర్తి నేరం రుజువైనందున సత్యనారాయణకు ఆరు నెలల జైలు శిక్షతోపాటు రూ.8 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించారు.
ఈ కేసులో ఫిర్యాదుదారుని తరపున న్యాయవాదులు నగేష్కుమార్, మధుసూదన్, రమేష్లు వాదించారు.









