భారత యువకుడికి తొలి క్యాన్సర్ వ్యాక్సిన్..
మరణాన్ని జయించనున్న శ్రీ వస్తావ
క్యాన్సర్ మహమ్మారిని అంతం చేసే దిశగా రష్యా కీలక అడుగు వేసిన విషయం తెలిసిందే. ప్రపంచంలోనే తొలి క్యాన్సర్ వ్యాక్సిన్ను ఆ దేశం రూపొందించింది. అయితే భారత్లో ఈ వ్యాక్సిన్ను మొదటిసారి ఓ యువకుడు ఉపయోగించుకోనున్నాడు.
⇒ లక్నోకు చెందిన 19 ఏళ్ల యువకుడు అంష్ శ్రీవాస్తవకు రష్యా ప్రభుత్వం నుంచి సహాయం లభించబోతోంది. గత కొన్ని రోజులుగా క్యాన్సర్తో బాధపడుతున్న అంష్కు రష్యా తయారు చేసిన కొత్త క్యాన్సర్ వ్యాక్సిన్ “ఎంటెరోమిక్స్” (Enteromix) క్లినికల్ ట్రయల్ జరిగే అవకాశం ఉంది. ఇది జరిగితే.. భారత్లో క్యాన్సర్ వ్యాక్సిన్ ఉపయోగించుకోనున్న తొలి వ్యక్తిగా అంష్ నిలవనున్నాడు.
⇒ రష్యా ప్రభుత్వం అక్టోబర్ 27, 2025 తేదీతో ఒక అధికారిక లేఖను పంపింది. అందులో అంష్ కేసు రష్యా ఆరోగ్య మంత్రిత్వ శాఖకు పంపించామని స్పష్టంగా తెలిపింది. ఆ లేఖలో రష్యా ప్రభుత్వం.. “మీ అభ్యర్థనను రష్యా ప్రభుత్వ కార్యాలయం పరిశీలించి, ఫెడరల్ చట్టం ప్రకారం రష్యా ఆరోగ్య మంత్రిత్వ శాఖకు పపించాము.” ఈ లేఖపై రష్యా పౌర వినతుల విభాగానికి చెందిన ప్రధాన సలహాదారు సంతకం చేశారు. దీంతో అంష్ కుటుంబం నెలల తరబడి ఎదురుచూసిన ఆశకు కొంత వెలుగొచ్చింది.
⇒ ఇటీవల ఓ జాతీయ మీడియా సంస్థ ప్రచురించిన కథనంతో అంష్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అంష్ తండ్రి మనూ కుమార్ శ్రీవాస్తవ, తల్లి కంచన్ లతా తమ కుమారుడి ప్రాణాల కోసం భారత, రష్యా ప్రభుత్వాలకు పలు లేఖలు రాశారు. వారు రష్యా నేషనల్ మెడికల్ రీసెర్చ్ రేడియాలాజికల్ సెంటర్, ఎంగెల్హార్డ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మాలిక్యులర్ బయాలజీ సంయుక్తంగా రూపొందించిన “ఎంటెరోమిక్స్” ట్రయల్లో కుమారుడిని చేర్చాలని విజ్ఞప్తి చేశారు. దీంతో రష్యా ప్రభుత్వం స్పందించింది.
⇒ తన కొడుకు జీవితం కోసం ఏడాదిగా పోరాడుతున్న కంచన్ లతా ఇప్పుడు కొంత ఊపిరి పీల్చుకున్నారు. “బహుశా దేవుడు మా ప్రార్థనలు విన్నాడు. ప్రతీ రోజూ ఒక అద్భుతం కోసం ప్రార్థించేవాళ్లం. డాక్టర్లు ఏమీ చేయలేమని చెప్పినప్పుడు ఈ వ్యాక్సిన్ మా చివరి ఆశగా మారింది.” అని చెప్పుకొచ్చారు Enteromix రష్యా









