గోల్డెన్ న్యూస్ / వెబ్ డెస్క్ / తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి విద్యార్థిగా మారనున్నారు. అవును ఇది నిజమే విజ్ఞాన సముపార్జనతో పాటు ఆధునిక పాలన, నాయకత్వ నైపుణ్యాలను మెరుగుపర్చుకునే లక్ష్యంతో ఆయన అమెరికా లోని ప్రపంచ ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీలో ప్రత్యేక కోర్సుకు హాజరుకానున్నారు.
హార్వర్డ్ కెన్నెడీ స్కూల్లో నిర్వహించే ‘లీడర్షిప్ ఫర్ ది ట్వంటీ ఫస్ట్ సెంచరీ: కేయాస్, కాన్స్టిక్ట్, అండ్ కరేజ్’ (21వ శతాబ్దపు నాయకత్వం: అరాజకం, సంఘర్షణ, ధైర్యం) అనే ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్లో ఆయన చేరనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. మేడారం పర్యటనను ముగించుకున్న సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్రానికి అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించే ఉద్దేశంతో స్విట్జర్లాండ్లోని దావోస్కు బయలుదేరి వెళ్లారు. అక్కడ జరగనున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో పాల్గొన్న అనంతరం, జనవరి 23న ఆయన నేరుగా అమెరికా వెళ్లనున్నారు
మసాచుసెట్స్ రాష్ట్రంలోని హార్వర్డ్ కెన్నెడీ స్కూల్ క్యాంపస్లో జనవరి 25 నుంచి 30 వరకు జరిగే ఈ ప్రత్యేక శిక్షణ తరగతులకు సీఎం హాజరవుతారు. వారం రోజుల పాటు సాగే ఈ ఇంటెన్సివ్ లెర్నింగ్ ప్రోగ్రామ్ పూర్తయ్యాక, హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి సర్టిఫికేట్ అందుకోనున్నారు. అనంతరం ఫిబ్రవరి 2న సీఎం రేవంత్ రెడ్డి తిరిగి హైదరాబాద్ కు చేరుకోనున్నారు. హార్వర్డ్ కెన్నెడీ స్కూల్లోని ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ విభాగం అత్యంత అనుభవజ్ఞులైన రాజకీయ, పరిపాలనా నాయకుల కోసం ఈ కోర్సును రూపొందించింది. ఇది కేవలం సిద్ధాంతాలకు మాత్రమే పరిమితం కాకుండా, నిజ జీవితంలో ఎదురయ్యే క్లిష్టమైన సవాళ్లను ఎలా ఎదుర్కోవాలి అనే అంశాలపై ప్రధానంగా దృష్టి సారిస్తుంది.
అనిశ్చిత పరిస్థితులు, రాజకీయ మార్పులు, విభేదాలు, సంక్షోభాలను సమర్థవంతంగా నిర్వహించడం, అధికారం కన్నా పనితీరు మరియు వ్యక్తిత్వం ద్వారా ప్రజలను ప్రభావితం చేయడం, సామాజిక మార్పు వైపు ప్రజలను ప్రేరేపించడం వంటి అంశాలపై లోతైన తరగతులు ఉంటాయి. అంతర్జాతీయ స్థాయిలో చోటుచేసుకున్న కేస్ స్టడీస్, గ్రూప్ డిస్కషన్స్, రియల్-లైఫ్ లీడర్షిప్ సవాళ్లపై సమగ్ర విశ్లేషణ ఈ కోర్సులో భాగంగా ఉంటుంది. ఈ కోర్సుకు రాజకీయ నాయకులు, ప్రభుత్వ సీనియర్ అధికారులు, అంతర్జాతీయ సంస్థల సీఈవోలు వంటి ఎంపికైన వ్యక్తులకే అవకాశం ఉంటుంది. ఈ శిక్షణ ద్వారా రాష్ట్ర పాలనలో మరిన్ని వినూత్న నిర్ణయాలు, ఆధునిక విధానాలు అమలు చేసే అవకాశం ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అలాగే, వ్యక్తిగత నాయకత్వ శైలిపై ఆత్మపరిశీలనకు, అంతర్జాతీయ స్థాయి నాయకులతో నెట్వర్కింగ్ పెంపొందించుకునేందుకు ఈ వేదిక ఉపయోగపడనుంది. భారతదేశం నుంచి ఈ తరహా కోర్సుకు ప్రత్యక్షంగా హాజరై అభ్యసించనున్న తొలి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి నిలవడం విశేషం కావడంతో, ఆయన ఈ నిర్ణయం రాజకీయ, పరిపాలనా వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.









