గోల్డెన్ న్యూస్ /భూపాలపల్లి : విద్యార్థులకు క్రమశిక్షణ నేర్పాల్సిన ఉపాధ్యాయుడు క్రమశిక్షణ తప్పాడు. మరో ఉపాధ్యాయుడి పై కోపంతో విద్యార్థుల ఆరోగ్యంతో ఆటలు ఆడాడు. తాగునీటీలో మోను పురుగుల మందు కలిపాడు. దీంతో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనప జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చోటు చేసుకుంది.
భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని గాంధీనగర్లో అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాల ఉంది. పాఠశాలలో కలుషిత నీటిని తాగి శుక్రవారం 13 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో సిబ్బంది వెంటనే వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. శుక్రవారం ఉదయం టిఫిన్ చేశాక.. స్టీల్ క్యాన్లో నిల్వ చేసిన నీటిని తాగిన విద్యార్థులు అనారోగ్యానికి గురయ్యారు. పలువురు కడుపులో నొప్పి రాగా.. మరికొంత మంది వాంతులు చేసుకున్నట్లు ప్రిన్సిపాల్ వెంకన్న తెలిపారు.
విచారణలో వెలుగులోకి
విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు సమాచారం అందుకున్న డీఈవో రాజేందర్, సీఐ నరేష్కుమార్ పాఠశాలను సందర్శించి. నీటి నమూనాలు సేకరించి ల్యాబ్ కు పంపించారు. ఆ నీటిని పరీక్షించిన ల్యాబ్ సిబ్బంది అందులో మోనో మందు కలిపినట్లు తెలిపారు. దీంతో అధికారులు విచారణ చేపట్టగా సైన్స్ టీచర్ రాజేందర్ మందు కలిపాడని విద్యార్థులు తెలిపారు. ప్రిన్సిపాల్తో గొడవ పడి వాటర్ ట్యాంకు లో తానే మందు కలిపినట్లు రాజేందర్ ఒప్పుకున్నాడు.
తనపై అనుమానం రాకుండా రాజేందర్ కూడా ఆ నీళ్లు తాగాడు. ప్రిన్సిపాల్, టీచర్ల మధ్య గొడవల కారణంగానే నీళ్లలో మోనో మందు కలిపినట్టు రాజేందర్ ఒప్పుకున్నట్లు సమాచారం. ఈ ఘటనలో ఆయన సైతం అస్వస్థతకు గురయ్యాడు. 13 మంది విద్యార్థులు ప్రస్తుతం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడిన సదరు ఉపాధ్యాయుడు పై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.









