లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్సై

గోల్డెన్ న్యూస్ /మెదక్ : లంచం తీసుకుంటూ ఓ సబ్ ఇన్ స్పెక్టర్ ఏసీబీ అధికారులకు దొరికి పోయాడు. ఓ కేసు విషయమై రూ.30 వేలు లంచం తీసుకుంటుండగా.. ఏసీబీ దాడి చేసి పట్టుకుంది. మెదక్ జిల్లా టెక్మల్ పోలీస్ స్టేషన్లో  ఎస్సైగా రాజేశ్ విధులు నిర్వహిస్తున్నాడు.

 

చోరీ కేసు విషయమై స్థానికుడైన ఓ వ్యక్తితో పాటు అతని స్నేహితుడిపైనా కేసు నమోదు కాగా.. లోక్ అదాలత్ లో పరిష్కారమైంది. అయితే, తాజాగా అదే కేసులో పోలీసులు నిందితుడికి బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 35 కింద మరోసారి నోటీసులు జారీ చేశారు. లోక్ అదాలత్ లో కొట్టేసిన ఈ కేసును పరిష్కరించేందుకు ఎస్సై నిందితుడి నుంచి రూ.30 వేల లంచం డిమాండ్ చేశాడు. ఈ క్రమంలో బాధితుడు ఏసీబీని ఏసీబీని ఆశ్రయించగా, వారు వల పన్నారు. నిందితుడు మంగళవారం పోలీస్ స్టేషన్లో ఎస్సై రాజేశ్కు లంచం ఇస్తుండగా, ఏసీబీ అధికారులు  అక్కడ ప్రత్యక్షమయ్యారు.

పారిపోతున్న ఎస్ఐ ని వెంటాడి పట్టుకున్న ఏసీబీ

అవినీతి నిరోధకశాఖ అధికారులను చూసి ఎస్సై రాజేశ్ అక్కడి నుంచి పరారయ్యాడు. లంచం తీసుకుంటున్న క్రమంలో తాను దొరికి పోతాననే భయంతో పారిపోయేందుకు ప్రయత్నించాడు. సమీప పొలాల నుంచి పారిపోతుండగా, ఏసీబీ అధికారులు వెంటపడి పట్టుకున్నారు. ఎస్సై రాజేశ్ ను అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు అధికారులు తెలిపారు.

టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్న గ్రామస్తులు

మరోవైపు, ఎస్సై పట్టుబడిన విషయం తెలిసి స్థానికులు సంబురాలు చేసుకున్నారు. అవినీతి పీడ విరగడ అయిందంటూ పోలీసుస్టేషన్ ఎదుట పటాకులు కాల్చారు.

Facebook
WhatsApp
Twitter
Telegram