సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి తుమ్మల

సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి తుమ్మల

గోల్డెన్ న్యూస్ / భద్రాద్రి  / జిల్లాలో  తెలంగాణకే తలమానికంగా ఉండేలా ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీని నెలకొల్పుతున్నట్లు రాష్ట్ర వ్యవసాయ, చేనేత శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గంలో నూతనంగా నెలకొల్పుతున్న ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీని రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి డిసెంబర్ 2 మధ్యాహ్నం 2గంటలకు ప్రారంభించనున్నట్లు మంత్రి  తెలిపారు. సీఎం పర్యటన ఏర్పాట్లను ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు.. మాజీ ప్రధాని స్వర్గీయ మన్మోహన్ సింగ్ పేరుతో ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీకి ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ఎర్త్  సైన్సెస్ యూనివర్సిటీ ఏర్పాటుతో కొత్తగూడెం జిల్లాకు మహర్దశ పట్టనుందని చెప్పారు. రాబోయే తరాలకు మేలు చేసేలా యూనివర్సిటీ ఉంటుందని అన్నారు. పాల్వంచలో నూతనంగా థర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని వెల్లడించారు. సీతారామ ప్రాజెక్టు డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ భూ సేకరణకు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో నిధులు మంజూరు అవుతున్నాయని, సీతారామ ప్రాజెక్ట్ పూర్తి చేస్తే ఉమ్మడి ఖమ్మం జిల్లా సస్యశ్యామలం  అవుతుందని తద్వారా రైతుల కష్టాలు శాశ్వతంగా దూరం అవుతాయని  స్పష్టం చేశారు. అదేవిధంగా భద్రాచలం నుంచి మణుగూరు ఏటూరు నాగారం మీదుగా జాతీయ రహదారి నిర్మిస్తామని, జాతీయ రహదారుల నిర్మాణంతో ఖమ్మం కొత్తగూడెం జిల్లాల రూపురేఖలు మారుతాయని తెలిపారు. ప్రతి వర్గానికి సంక్షేమ ఫలాలను  అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రజలంతా సీఎం రేవంత్ రెడ్డి పర్యటన విజయవంతం చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో శానససభ్యులు కూనంనేని సాంబశివరావు, పాయం వెంకటేశ్వర్లు, జారే ఆదినారాయణ, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎస్ పీ బీ.రోహిత్ రాజు, జిల్లా అధికారులు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram