పిల్లలు, యువతలో ఆకస్మిక మరణాలు పెరగడానికి కొవిడ్ టీకాలే కారణమన్న ప్రచారాలను ఢిల్లీ AIIMS వైద్యులు స్పష్టంగా ఖండించారు. 18 నుంచి 45 ఏళ్ల వయసు గల వ్యక్తుల ఆకస్మిక మరణాలపై ఏడాది పాటు నిర్వహించిన శాస్త్రీయ అధ్యయనం ఆధారంగా ఈ విషయాన్ని వెల్లడించారు.
AIIMS వైద్యులు పరీక్షించిన మృతదేహాల వివరాల ప్రకారం, 45 ఏళ్లలోపు వారిలో 42.6 శాతం మంది గుండె సంబంధిత వ్యాధుల వల్ల మరణించినట్లు తేలింది. అలాగే 21.3 శాతం మంది శ్వాసకోశ సమస్యల కారణంగా ప్రాణాలు కోల్పోయినట్లు గుర్తించారు. ఈ మరణాలకు కొవిడ్ టీకాలకు ఎలాంటి ప్రత్యక్ష సంబంధం లేదని వైద్యులు స్పష్టం చేశారు.
ఇంకా, ఆకస్మిక మరణాల సంఖ్య స్త్రీలతో పోల్చితే పురుషుల్లో ఐదు రెట్లు ఎక్కువగా ఉన్నట్లు అధ్యయనం వెల్లడించింది. జీవనశైలి మార్పులు, ముందస్తు వైద్య పరీక్షల లోపం, గుండె సంబంధిత సమస్యలను నిర్లక్ష్యం చేయడం వంటి అంశాలే ప్రధాన కారణాలుగా వైద్యులు అభిప్రాయపడ్డారు.
ఈ అధ్యయనంతో కొవిడ్ టీకాలపై అనవసర భయాలు, అపోహలకు తావు లేదని AIIMS వైద్యులు ప్రజలకు భరోసా ఇచ్చారు.
Post Views: 40









