సంక్రాంతి కానుకగా తెలంగాణ ప్రభుత్వ కీలక నిర్ణయం

– సంక్రాంతి కానుకగా తెలంగాణ ప్రభుత్వ కీలక నిర్ణయం

– అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాల లబ్ధి

 

సంక్రాంతి పండుగను పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వరుసగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ప్రభుత్వం, ఇప్పటివరకు పెండింగ్‌లో ఉన్న హామీల అమలుపై మరింత దృష్టి సారించింది. అర్హత ఉన్నప్పటికీ పలు కారణాల వల్ల పథకాల లబ్ధి పొందలేకపోయిన వారికి మరో అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం ముందడుగు వేసింది.

 

ఉద్యోగుల బకాయిలను ప్రతినెలా నిర్దేశిత సమయంలో విడుదల చేస్తూ వస్తున్న ప్రభుత్వం, మహిళలకు ఆర్థికంగా అండగా నిలిచేలా కొత్త కార్యక్రమాలను కూడా సిద్ధం చేస్తోంది. అదే సమయంలో ఇప్పటికే అమలులో ఉన్న పథకాలకు అర్హత ఉన్నా, గతంలో లబ్ధిదారులుగా ఎంపిక కాకపోయిన వారి సమస్యను గుర్తించిన ప్రభుత్వం… అందరికీ సమాన న్యాయం చేయాలనే లక్ష్యంతో తాజా నిర్ణయం తీసుకుంది.

 

ఈ నిర్ణయంలో భాగంగా గృహజ్యోతి మరియు మహాలక్ష్మి పథకాలకు అర్హత ఉన్నా ఇప్పటివరకు లబ్ధి పొందని వారందరికీ మరో అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం కొత్త విధి విధానాలను ఖరారు చేసి, ప్రతి మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయాల్లో ప్రజా పాలన అధికారులను నియమించింది. వీరి ద్వారా దరఖాస్తులు స్వీకరించి, పరిశీలించిన అనంతరం అర్హులైన వారిని పథకాల లబ్ధిదారుల జాబితాలో చేర్చనున్నారు.

 

గతంలో రేషన్ కార్డులు లేకపోవడం, దరఖాస్తులలోని వివరాల్లో తప్పులు దొర్లడం వంటి కారణాల వల్ల చాలా మంది పథకాలకు దూరమయ్యారని ప్రభుత్వం గుర్తించింది. తమ పాలనలో అర్హుడైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాల లబ్ధి అందాలన్న హామీకి కట్టుబడి ఉన్నామని ప్రభుత్వం ఈ సందర్భంగా స్పష్టం చేసింది.

 

ఇదిలా ఉండగా, ఇటీవల ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులను జారీ చేయడంతో ఆ కార్డులు పొందినవారూ ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అర్హులయ్యారు. కొత్త రేషన్ కార్డు పొందిన వారు ఎంపీడీవో కార్యాలయాలను సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. అలాగే మున్సిపల్ వార్డుల పరిధిలో కూడా ప్రజా పాలన అధికారుల వద్ద దరఖాస్తులు సమర్పించవచ్చని తెలిపారు.

 

గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్ పొందేందుకు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, కరెంట్ బిల్లులను సమర్పించాల్సి ఉంటుంది. మహాలక్ష్మి పథకం ద్వారా రూ.500కే గ్యాస్ సిలిండర్ పొందాలంటే ఆధార్ కార్డు, రేషన్ కార్డు, గ్యాస్ పాస్‌బుక్, బ్యాంక్ ఖాతా పత్రాలు సమర్పించాలి. అర్హులైన లబ్ధిదారులకు సంబంధించిన ఆర్థిక సహాయాన్ని నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.

 

ఈ నిర్ణయంతో ఇప్పటివరకు సంక్షేమ పథకాల లబ్ధి అందని అర్హులైన వేలాది కుటుంబాలకు కొత్త ఆశ కలిగింది. సంక్రాంతి పండుగ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ప్రజల్లో విశేష స్పందనను రాబడుతోంది.

Facebook
WhatsApp
Twitter
Telegram