గోల్డెన్ న్యూస్ /అనకాపల్లి /జిల్లాలో అర్ధరాత్రి సమయంలో స్వల్ప భూప్రకంపనలు సంభవించాయి.. రాత్రి 12 గంటల 30 నిమిషాల సమయంలో కొన్ని సెకన్ల పాటు ఈ ప్రకంపనలు సంభవించినట్లు ప్రజలు చెబుతున్నారు. దీంతో ఒక్కసారిగా ప్రజల్లో ఆందోళన నెలకొంది. అనకాపల్లి పట్టణం పరిసర ప్రాంతాలతో పాటు సమీప గ్రామాల్లో కూడా ప్రకంపనల ప్రభావం కనిపించినట్లు సమాచారం. ఇళ్లలోని కొన్ని సామాగ్రి స్వల్పంగా కదిలినట్లు స్థానికులు పేర్కొన్నారు. కొంతమంది నిద్రలో ఉండగానే మంచాలు, ఫర్నిచర్ స్వల్పంగా కంపించినట్లు తెలిపారు. ప్రకంపనలు తక్కువ స్థాయిలో ఉండటంతో ఎలాంటి ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం జరగలేదని సమాచారం. అయితే అర్ధరాత్రి సమయంలో ఈ ఘటన చోటుచేసుకోవడంతో ప్రజలు ఇళ్ల బయటకు వచ్చి పరిస్థితిని గమనించారు. ఇప్పటివరకు ఈ భూప్రకంపనలపై అధికారికంగా ఎలాంటి నమోదు కాలేదని తెలుస్తోంది. భూకంప పరిశీలనా కేంద్రాల నుంచి కూడా ఇంకా స్పష్టమైన సమాచారం వెలువడాల్సి ఉంది. ఈ ఘటనపై అధికారులు వివరాలు సేకరిస్తున్నట్లు సమాచారం.









