మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలు, వీ.బీ. జీరాంజీ చట్టం అంశాలపై కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రాష్ట్రాల మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డా. దనసరి అనసూయ సీతక్క పాల్గొన్నారు. స్పెషల్ చీఫ్ సెక్రటరీ సంజయ్ కుమార్, డైరెక్టర్ దివ్యా దేవరాజన్ తదితరులు హాజరయ్యారు.
ములుగు జిల్లా రాయిని గూడెం గ్రామ పర్యటనలో ఉన్న మంత్రి సీతక్క అక్కడ నుంచే కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొని కీలక అంశాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుతం అమలవుతున్న ఉపాధి హామీ చట్టాన్ని యథావిధిగా కొనసాగించాలని ఆమె స్పష్టం చేశారు. వీ.బీ. జీరాంజీ చట్టంపై మరింత విస్తృత చర్చ జరగాల్సిన అవసరం ఉందని, రాష్ట్రాల అభిప్రాయాలను పూర్తిగా తెలుసుకున్న తర్వాతే తదుపరి నిర్ణయం తీసుకోవాలని, అప్పటి వరకు ఆ ప్రక్రియను వాయిదా వేయాలని సూచించారు.
గత రెండు నెలలుగా కేంద్రం నుండి ఉపాధీ హమీ నిధులు విడుదల కాకపోవడంతో కార్మికులకు వేతనాలు అందకపోవడం ఆందోళనకరమని మంత్రి పేర్కొన్నారు. వేసవి కాలంలో పనుల సీజన్ పీక్ స్టేజీలో ఉంటుందని..వేతనాల చెల్లింపు ఆలస్యం జరిగితే కార్మికులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుందని పేర్కొన్నారు. ఉపాధీ హమీ చట్టానికి సంబంధించి రాష్ట్రానికి కేంద్రం నుండి రూ. 1110 కోట్ల నిధులు పెండింగ్లో ఉన్నాయని, వాటిని వెంటనే విడుదల చేయాలని కోరారు.
ఇటీవల తరచూ కొత్త సాఫ్ట్వేర్ వ్యవస్థలను ప్రవేశపెడుతున్న విషయాన్ని ప్రస్తావిస్తూ, ఒక వ్యవస్థను పూర్తిగా అర్థం చేసుకొని అమలు చేయకముందే మరో వ్యవస్థను ప్రవేశపెట్టడం క్షేత్రస్థాయిలో సమస్యలను కలిగిస్తోందని తెలిపారు. మార్పులను దశలవారీగా అమలు చేస్తే అవగాహన, అనుసరణకు తగిన సమయం లభిస్తుందని సూచించారు. మరీ ముఖ్యంగా మోబైల్ నెట్ వర్క్ అంతగా లేని మారు మూల ప్రాంతాల్లో కూలీల ఫేస్ క్యాప్చరింగ్ కు ఎదరవుతున్న సమస్యలను దృష్టిలో ఉంచుకుని..నిబంధనలను కాస్త సడలించాలని కోరారు.
అలాగే తక్కువ సమయంలోనే వీ.బీ. జీరాంజీ చట్టం ద్వారా ఉపాధీ పనుల్లో 40 శాతం నిధులను రాష్ట్రాలు భరించాలనే నిబంధన రాష్ట్రాలకు భారంగా మారుతుందన్నారు. దీంతో పాటు నూతన చట్టంలో 60 రోజుల పాటు ఉపాధీ హలీడేను ప్రకటించడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ఒక సారి కూలీలు పట్టణాలకు వలసలు పోతే తిరిగి గ్రామాలకు రావడం కష్టమని, ఇది ఉపాధీ హమీ చట్ట లక్ష్యానికి పూర్తి విరుద్దమన్నారు. ఈ నేపధ్యంలో ఏడాదంతా ఉపాధి హమీ పనులు కొనసాగించాలని కేంద్ర మంత్రిని విజ్ఞప్తి చేశారు.
మంత్రి సీతక్క ప్రస్తావించిన అంశాల పట్ల కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సానుకూలంగా స్పందించారు . తెలంగాణ కు రావాల్సిన పెండింగ్ నిధులను ఒకటి రెండు రోజుల్లో విడుదల చేస్తామన్నారు. వీ.బీ. జీరాంజీ చట్టం పట్ల రాష్ట్రాలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని..విస్త్రుత చర్చల అనంతరమే చట్టాన్ని అమలు చేస్తామన్నారు.








