ఉద్యోగులు, పెన్షనర్లకు ఆరోగ్య భద్రత

కొత్త ఆరోగ్య పథకం అమలుపై సీఎం సమీక్ష

గోల్డెన్ న్యూస్ / హైదరాబాద్ / తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల ఆరోగ్య భద్రత కోసం ప్రభుత్వం అమల్లోకి తీసుకురానున్న ఉద్యోగుల ఆరోగ్య పథకం అమలుపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులతో కీలక సమీక్ష నిర్వహించనున్నారు.

 

ఈ పథకాన్ని ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణ ట్రస్ట్ ద్వారా అమలు చేయనున్నారు. ఈ ట్రస్టులో ఉద్యోగ సంఘాల నుంచి ఆరుగురు, పెన్షనర్ల నుంచి ఇద్దరు ప్రతినిధులు సభ్యులుగా ఉండనున్నారు.

 

అలాగే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి ఒకరిని ఈ ట్రస్టుకు ప్రధాన కార్యనిర్వాహక అధికారిగా నియమించనున్నారు. పథకం అమలుకు అవసరమైన వివరాల సేకరణ ఇప్పటికే ప్రారంభమైంది. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యుల వివరాలను సేకరించేందుకు ఆర్థిక శాఖ ఇప్పటికే అన్ని శాఖలకు సర్క్యులర్ జారీ చేసింది.

 

మే 31వ తేదీలోపు వివరాలు అప్‌లోడ్ చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ వివరాల ఆధారంగా డిజిటల్ ఆరోగ్య కార్డులు జారీ చేసి, నగదు రహిత వైద్య సేవలు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.

Facebook
WhatsApp
Twitter
Telegram