గోల్డెన్ న్యూస్ /ఆదిలాబాద్ / నిర్మల్లో రూ.50 వేల లంచం తీసుకుంటూ ఇద్దరు రాష్ట్ర పన్నుల శాఖ అధికారులు ఏసీబీకి చిక్కారు. నిర్మల్ సర్కిల్ స్టేట్ ట్యాక్స్ ఆఫీసర్ కొప్పెల గోదావరి, నిర్మల్ జిల్లా అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ మంత్రి సాయి కృష్ణను ఏసీబీ అధికారులు సోమవారం రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు.
మంచిర్యాల జిల్లాకు చెందిన ఓ వ్యాపారి ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు ట్రాప్ నిర్వహించారు. శ్రీ లక్ష్మీ ప్రసన్న జ్యువెలర్స్కు సంబంధించిన 2022-23, 2023-24 ఆర్థిక సంవత్సరాల రికార్డుల ఆడిట్లో అనుకూలమైన నివేదిక ఇచ్చేందుకు అధికారులు తొలుత రూ.1 లక్ష లంచం డిమాండ్ చేశారు. అనంతరం దాన్ని రూ.90 వేలు, రూ.80 వేలకు తగ్గించి చివరకు రూ.50 వేలకు ఒప్పుకున్నారు.
ట్రాప్ సమయంలో స్టేట్ ట్యాక్స్ ఆఫీసర్ కొప్పెల గోదావరి ఫిర్యాదుదారుడి నుంచి రూ.50 వేల లంచం తీసుకుని సీనియర్ అసిస్టెంట్ మంత్రి సాయి కృష్ణకు అందజేసినట్లు ఏసీబీ తెలిపింది. అనంతరం ఆ మొత్తాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు అధికారుల చేతులకు నిర్వహించిన రసాయన పరీక్షల్లో పాజిటివ్ ఫలితాలు వచ్చినట్లు ఏసీబీ వెల్లడించింది లంచం తీసుకుని అధికార దుర్వినియోగానికి పాల్పడిన ఇద్దరినీ అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేస్తున్నట్లు ఏసీబీ తెలిపింది.









