గోల్డెన్ న్యూస్/ప్రకాశం : కంభం మండలం దేవనగరంలో విషాదం చోటు చేసుకుంది. పసుపు పారాణి ఆరకముందే నవ వధువు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం రెండు రోజుల క్రితమే అదే గ్రామానికి చెందిన వెంకటేష్ తో పెద్దల సమక్షంలో ఘనంగా వివాహమైంది. అంగరంగ వైభవంగా ఇరు కుటుంబాలు పెళ్లి చేశాయి. మంగళవారం రాత్రి వరకు కూడా నూతన దంపతులు అన్యోన్యంగా ఉన్నారని బంధువులు చెబుతున్నారు. ఇంట్లో అందరూ బంధువులు ఉండగానే సుస్మిత ఆత్మహత్యకు పాల్పడడం కలకలం రేపింది. ఉదయం నుంచి సంతోషంగానే ఉందని ఇంట్లో వారు చెబుతున్నారు. అలాంటిది ఈ రోజు మధ్యాహ్నం ఏమైందో ఏమో కాని సుస్మిత ఇంట్లోనే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
విషయం తెలుసుకున్న బంధువులు హుటాహుటిన కంభం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే సుస్మిత మృతిచెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు.రెండు రోజులక్రితం వరకు ఆనందంగా గడిపిన సుస్మిత పెండ్లయిన మరునాడే విగత జీవిగా మారడాన్ని చూసి బంధువులు కన్నీరు మున్నీరవుతున్నారు. కాగా భార్యభర్తల మధ్య ఏదైనా ఘర్షణ జరిగిందా? లేదా తల్లిదండ్రులు ఇష్టం లేని పెండ్లి చేయడం వల్ల ఆత్మహత్యకు పాల్పడిందా? అనే కోణంలో పోలీసుల విచారణ చేపట్టారు.. వివాహమైన రెండవ రోజునే నవవధువు ఆత్మహత్య చేసుకుని మృతి చెందటంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి..