⇒ తాసిల్దార్ కార్యాలయం ముందు సంస్కృతి సాంప్రదాయాలతో నిరసన.
⇒ జీవించే హక్కును కాల రాస్తున్న ప్రభుత్వాలు
⇒ మౌలిక సదుపాయాలు కల్పించే వరకు సమరశీల పోరాటాలు.
⇒ సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు అన్నవరపు కనకయ్య
గోల్డెన్ న్యూస్ /మణుగూరు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు లో పోడు, సాగు భూములకు పట్టాలు ఇవ్వాలని, ఫారెస్ట్ అధికారుల వేధింపులు ఆపాలని, ఎస్ టి కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాలని, వలస ఆదివాసి గ్రామాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని గురువారం మణుగూరు మండలంలో వలస ఆదివాసి గిరిజనలు భారీ ర్యాలీ నిర్వహించారు చంకలో పాలు తాగే చంటి బిడ్డలతో తల్లులు ర్యాలీలో పాల్గొన్నారు.డోలు కొమ్ములతో , గజ్జల ఆట,పాటలతో గిరిజన సాంప్రదాయాలు ప్రదర్శిస్తూ ర్యాలీ నిర్వహించారు అనంతరం తాసిల్దార్ కార్యాలయం ముందు గిరిజనులు తమ సంస్కృతి సాంప్రదాయాలతో నృత్యాలు చేస్తూ నిరసన తెలియజేసి స్తంభింపజేశారు అనంతరం తాసిల్దార్ అద్దంకి నరేష్ కు సమస్యలతో కూడిన వినతిపత్రం అందజేశారు అనంతరం సిపిఎం మండల కార్యదర్శి సత్రపల్లి సాంబశివరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు అన్నవరపు కనకయ్య మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసి గిరిజనుల ఓట్లతో గెలుస్తున్నారు తప్ప మౌలిక సదుపాయాలు కల్పించడం లేదన్నారు సిపిఎం ఆధ్వర్యంలో అనేక పోరాటం నిర్వహించి రేషన్ , ఆధార్ కార్డులు ఓటు హక్కును సాధించిపెట్టిందన్నారు. దుర్భర జీవితం గడుపుతున్న వలస ఆదివాసులకు మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు మణుగూరు మండలంలో రేగుల గండి, ఎన్నిక సర్వయ్య గుంపు, బుడుగుల ఇప్పల గుంపు, ఎస్టి కాలనీ, పెద్దపెల్లి గ్రామాలలో పోడు సాగు చేసుకుంటున్నా వలస ఆదివాసులపై ఫారెస్ట్ అధికారుల దౌర్జన్యాలు రోజురోజుకు పెరుగుతున్నాయి అన్నారు. వరి పంటపై గడ్డి మందు స్ప్రే చేయడం వలన నోటికాడి కూడు లాక్కోవడం, జీవించే హక్కును ప్రభుత్వాలు లేకుండా చేయడమేనని అన్నారు. బుడుగుల గ్రామంలో ఫారెస్ట్ అధికారులు పత్తి పంటను పీకేసారని తెలిపారు. వలస ఆదివాసులు భారతీయ పౌరులు కాదా అని ప్రశ్నించారు. కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వకుండా చదువుకు దూరం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామాలలో అంతర్గత రహదారులు విద్యుత్ సౌకర్యాలు లేక ప్రజల అవస్థలు పడుతున్నారన్నారు వలస ఆదివాసి గ్రామాలలో అంగన్వాడి పాఠశాలలు కూడా లేవన్నారు. వారు జీవించే గ్రామాల నుండి సరైన రహదారులు లేక ఆపత్కాలంలో ఆసుపత్రికి చేరాలంటే నరక యాతన అనుభవిస్తున్నారని తెలిపారు అనంతరం గిరిజన సంఘం రాష్ట్ర నాయకులు మడివి రమేష్ మాట్లాడుతూ నిజమైన ఆదివాసులమని మాకు జీవించే హక్కు లేకుండా ఈ ప్రభుత్వాలు చేస్తున్నాయన్నారు మా ఓట్లతో గద్దెనెక్కుతున్నారు తప్ప మాకు ఎలాంటి సదుపాయాలు కల్పించడం లేదన్నారు సాగు చేసుకుంటున్న భూములపై హక్కు పత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు ఆదివాసులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలు అమలు చేయాలని ఇందిరమ్మ ఇల్లు కట్టించి ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి వర్గ సభ్యులు పిట్టల నాగమణి ,బొల్లం రాజు ,సిఐటియు మండల కన్వీనర్ కొడిశాల రాములు, గిరిజన సంఘం నాయకులు పాయ నరసింహారావు, కొండ్రు గౌరీ, గుండి భీమయ్య, కుంజా రాజు, కారం భీమయ్య, గుంజ రాజా, బండారు సారిక, సంతోష్, నందయ్య, రమేష్ తదితరులు పాల్గొన్నారు..










