బీఆర్‌ఎస్ నేతల నిరసనపై సీతక్క ఇంట్రెస్టింగ్ కామెంట్స్

గోల్డెన్ న్యూస్/ హైదరాబాద్ : బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు నల్లచొక్కాలు ధరించి, చేతులకు బేడీలతో ఈరోజు మంగళవారం అసెంబ్లీకి వచ్చారు. లగచర్ల రైతులకు బేడీలు వేసినందుకు నిరసనగా ఆ పార్టీ ఎమ్మెల్యేలు వినూత్నంగా బేడీలు వేసుకుని మరీ సభకు వచ్చారు. అయితే బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే నిరసనపై మంత్రి సీతక్క ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంగళవారం మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో మంత్రి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు బేడీలు వేశారు తప్ప.. కేటీఆర్, హరీష్ బేడీలు వేసుకోలేదని.. ఈ ఘటనతో కేటీఆర్, హరీష్ దొరతనం మరోసారి బయటపడిందని అన్నారు. నిరసనలో కూడా బీఆర్ఎస్ నేతల్లో సమానత్వం లేదన్నారు. నిరసనల్లో కూడా తమ దురంకారాన్ని ప్రదర్శించారని మండిపడ్డారు.
రైతులకు బేడీలు వేయడంపై బీఆర్ఎస్ నేతలకు మాట్లాడే అర్హత లేదన్నారు. టీఆర్ఎస్ హయాంలో రైతులకు కనీసం పదిసార్లు బేడీలు వేశారని గుర్తుచేశారు. కనీసం అప్పుడు అధికారుల మీద చర్యలు కూడా లేవన్నారు. రైతులకు బేడీలు వేసిన అంశంపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయి చర్యలు కూడా తీసుకున్నారని తెలిపారు. సభలో వాళ్ళు పెట్టిన రూల్స్‌పై వాళ్ళే అభ్యంతరం చెప్పడం ఏంటన్నారు. గతంలో వెల్‌లోకి వస్తే సభ నుంచి సస్పెండ్ చేసేవారని.. కానీ ఇప్పుడు వాళ్లు పెట్టిన నిబంధనలనే వాళ్లు కాలరాస్తున్నారంటూ మంత్రి సీతక్క తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
హాట్‌హాట్‌గా అసెంబ్లీ సమావేశాలు కాగా.. ఈరోజు అసెంబ్లీ సమావేశాలు హాట్‌హాట్‌గా నడిచాయి. రాష్ట్రంలో అప్పుల అంశంపై కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతల మధ్య మాటలయుద్ధం నడిచింది. డిప్యూటీసీఎం భట్టి విక్రమార్క, మాజీ మంత్రి హరీష్‌ రావులు సవాళ్లు ప్రతిసవాళ్లు చేసుకున్నారు. ఎఫ్‌ఆర్‌బీఎమ్ రుణాలపై మాజీ మంత్రి హరీష్ రావు అడిగిన ప్రశ్నకు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క సమాధానం ఇస్తూ 2024 నవంబర్ వరకు ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చిన రుణాలు రూ.51,200 కోట్లు అని భట్టి తెలిపారు. అయితే భట్టి విక్రమార్క వ్యాఖ్యలపై హరీష్‌రావు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి రూ.7 లక్షల కోట్ల అప్పు ఉందనేది అవాస్తవమన్నారు. రూ.51 వేల కోట్ల అప్పు చేశామని ఒప్పుకున్నారన్నారు. ఇవాళ మరో రూ.3 వేల కోట్ల అప్పు తీసుకున్నారని.. ఒక్క ఏడాదిలో లక్షా 27వేల కోట్ల అప్పులు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందని తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో రూ.4 లక్షల కోట్ల అప్పులు చేశామని చెప్పుకొచ్చారు.
అయితే మాజీ మంత్రి హరీష్ సభను తప్పుదోవ పట్టిస్తున్నారని భట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘అప్పులపై చర్చకు మేం సిద్ధం.. బీఆర్ఎస్ సిద్ధమా?’’ అని భట్టి సవాల్ విసరగా.. అందుకు మాజీ మంత్రి హరీష్ రావు సిద్ధమే అని తెలిపారు. భట్టి సవాల్‌ను స్వీకరిస్తున్నామని.. అప్పులపై చర్చకు సిద్ధమని హరీష్ రావు ప్రకటించారు..

Recent News :

MOHAMMED RAFEE

MOHAMMED RAFEE

GOLDEN NEWS EDITOR & CHAIRMAN

Admin

Golden News

Facebook
WhatsApp
Twitter
Telegram