కరివేపాకే కదా అని తీసేయకండి అలా!

⇒ సంవత్సరానికి 100 కోట్లు పైనే టర్న్ అవర్

 ⇒ ఎకరాకు సంవత్సరానికి ఖర్చు లక్ష 

⇒ఇతర రాష్ట్రాలతోపాటు దుబాయ్‌కు ఎగుమతి

మనం తినే కూరలు సువాసనతో పాటు రుచికరంగా ఉండాలంటే కచ్చితంగా కరివేపాకు వేయాల్సిందే. మనం మాత్రం దాన్ని ప్లేట్ నుంటి తొలగిస్తాం. ఆ కరివేపాకు సాగే ఇప్పుడు  కోట్ల రూపాయలు తెచ్చి పెడుతుంది. ఎన్నో పోషక విలువలు కలిగిన దీన్ని 2 తెలుగు రాష్ట్రాల్లో సాగు చేస్తున్నారు. ఇక్కడి నుంచే ఇతర ప్రాంతాలకు, దేశాలకు ఎగుమతి అవుతుంది.కరివేపాకు రూ.5 లేదా రూ.10 పెడితే ఏ సంతలో, మార్కెట్లోనైనా ఓ చిన్న కట్ట లభిస్తుంది. అంతమాత్రాన దాన్ని తేలిగ్గా తీసి పారేయొద్దు. ఎందుకంటే కరివేపాకు ద్వారా రాష్ట్రంలో ప్రతి సంవత్సరం రూ.100 కోట్ల వ్యాపారం జరుగుతోంది. గుంటూరు జిల్లా పెదవడ్లపూడి కరివేపాకు సాగుకు ఎంతో పేరు గాంచింది. అక్కడి రైతులు దీనిని వాణిజ్య పంటల కూడా సాగు ప్రారంభించారు. క్రమంగా ఇతర ప్రాంతాల్లోనూ భూములు లీజుకు తీసుకుని, సాగుచేయడం మొదలుపెట్టారు. అనంతపురం జిల్లా తాడిపత్రి, పెద్దపప్పూరుల్లో భారీ విస్తీర్ణంలో కరివేపాకు సాగవుతోంది. ప్రకాశం జిల్లా దర్శి, వైఎస్సార్‌ కడప జిల్లా జమ్మలమడుగు తదితర ప్రాంతాలతో పాటు, పల్నాడు, బాపట్ల, కృష్ణా జిల్లాల్లోనూ, తెలంగాణలోని హైదరాబాద్‌ శివార్లలో కొన్ని ప్రాంతాల్లోనూ సాగు చేస్తున్నారు.ఆంధ్రప్రదేశ్‌ ఉద్యానవన శాఖ లెక్కల ప్రకారం 3000 ఎకరాలకు పైగా పంట సాగులో ఉంది. రైతులు మాత్రం ఇంకా చాలా ఎక్కువ విస్తీర్ణంలో ఉందని చెబుతున్నారు. నవంబరు నుంచి ఫిబ్రవరి వరకు కరివేపాకు సాగు మెట్రిక్‌ టన్నుకు గరిష్ఠంగా రూ.30,000 రూ.40,000 వరకు ధర లభిస్తుంది. మిగిలిన సమయాల్లో అయితే దీని ధర రూ.10 వేల నుంచి రూ.30 వేల వరకు ఉంటుంది. పంట సాగుకు ఎకరానికి ఏడాదికి రూ.లక్ష ఖర్చు అవుతుంది. దాదాపు 20 మెట్రిక్‌ టన్నుల వరకు దిగుబడి వస్తుంది. రాష్ట్రంలోని అన్ని నగరాలు, పట్టణాలతో పాటుగా చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, కోయంబత్తూరు, ముంబైలకు కలిపి నిత్యం 50 నుంచి 60 లారీల ఆకు తరలిస్తారు. ఒక్కో లారీలో సగటున నాలుగున్నర టన్నుల లోడు తీసుకెళతారు. ఇది రవాణా చేసే సమయంలోనూ ప్రతి 50-60 కిలోమీటరుకు ఓసారి మొత్తం ఆకును నీటితో తడుపుతారు. లేకపోతే నల్లగా మారిపోయి, పనికిరాకుండా పోతుంది.  సాగు చేసిన కరివేపాకు గతంలో ముంబై నుంచి ఫ్రాన్స్, జర్మనీ, దుబాయ్‌లకు ఎగుమతి అయ్యేది. ఇటీవల కాలంలో పురుగు మందుల వినియోగం పెరగడంతో ప్రస్తుతం దుబాయ్‌కు మాత్రమే ఎగుమతి అవుతోంది. ఈ పంట సాగు కోసం ఒకసారి విత్తనం వేస్తే 30 సంవత్సరాల వరకు దిగుబడి చేతికి వస్తూనే ఉంటుందని రైతులు చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ కరివేపాకు సాగు ఆరంభించాలన్నా విత్తనాలను గుంటూరు జిల్లా పెదవడ్లపూడి నుంచే తీసుకెళుతారు.

Recent News :

MOHAMMED RAFEE

MOHAMMED RAFEE

GOLDEN NEWS EDITOR & CHAIRMAN

Admin

Golden News

Facebook
WhatsApp
Twitter
Telegram