గోల్డెన్ న్యూస్ /కరకగూడెం /గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో సజావుగా జరిగేలా అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని మణుగూరు డీఎస్పీ రవీందర్ రెడ్డి కోరారు. పంచాయతీ ఎన్నికలు నిష్పక్షపాతంగా, శాంతియుతంగా జరగడానికి పోలీసులు అన్ని చర్యలు తీసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. జరుగబోయే గ్రామ పంచాయతీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని మంగళవారం కరకగూడెం ఎస్సై పీవీఎన్ రావ్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో అవగాహన సదస్సు నిర్వహించారు. ఎన్నికల నియమావళి అమలు, శాంతి భద్రతల ఏర్పాట్లు వంటి అంశాలపై సమావేశంలో వివరించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ఎవరైనా చట్ట విరుద్ధంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రాజకీయ పార్టీలు, కార్యకర్తలు చట్టాలను పూర్తిగా పాటించాలని, ప్రజలను ప్రలోభపెట్టే చర్యలు, హింసాత్మక ఘటనలను ఏమాత్రం సహించబోమన్నారు.. ఈ కార్యక్రమంలొ ఏడుళ్ల బయ్యారం సీఐ వెంకటేశ్వరరావు, కరకగూడెం సిబ్బంది పాల్గొన్నారు..









