ప్రయాణికులకు గుడ్ న్యూస్

  హైదరాబాద్-విజయవాడ హైవేపై టోల్ ఫ్రీ ప్రయాణం?..

తెలంగాణ సర్కార్ కీలక యోచన

 

సంక్రాంతి రద్దీ దృష్ట్యా టోల్ రుసుము మినహాయింపునకు యోచన

 

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి లేఖ రాయనున్న మంత్రి కోమటిరెడ్డి

 

 

సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ నుంచి ఆంధ్రా వైపు వెళ్లే ప్రయాణికులకు ఊరటనిచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. పండుగ సమయంలో అత్యంత రద్దీగా ఉండే హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై మూడు, నాలుగు రోజుల పాటు టోల్ వసూళ్లను నిలిపివేయాలని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి యోచిస్తున్నారు. దీనికి సంబంధించి కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి, జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI)కు లేఖ రాయాలని నిర్ణయించారు.

 

ప్రతి ఏటా సంక్రాంతికి పంతంగి, కొర్లపహాడ్, చిల్లకల్లు టోల్ ప్లాజాల వద్ద వాహనాలు కిలోమీటర్ల మేర బారులు తీరుతుంటాయి. ఫాస్టాగ్ ఉన్నప్పటికీ లక్షల సంఖ్యలో వాహనాలు రావడంతో గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. ప్రస్తుతం ఈ హైవేపై ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు, విస్తరణ పనులు జరుగుతుండటంతో ట్రాఫిక్ సమస్య మరింత తీవ్రమయ్యే అవకాశముంది. టోల్ వసూళ్ల కోసం వాహనాలను ఆపితే హైవే మొత్తం స్తంభించిపోయే ప్రమాదం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

 

ఈ నేపథ్యంలో వాహనాలు టోల్ గేట్ల వద్ద ఆగకుండా సాఫీగా వెళ్లేలా చూసేందుకే టోల్ మినహాయింపు ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. ఈ అంశంపై చర్చించేందుకు మంగళవారం సచివాలయంలో ఉమ్మడి నల్గొండ జిల్లా కలెక్టర్లు, పోలీస్, ఆర్అండ్‌బీ అధికారులతో మంత్రి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. కేంద్రం గనుక ఈ ప్రతిపాదనకు సానుకూలంగా స్పందిస్తే, ఈసారి సంక్రాంతి ప్రయాణం ప్రజలకు ఎంతో సౌకర్యవంతంగా మారనుంది.

Recent News :

MOHAMMED RAFEE

MOHAMMED RAFEE

GOLDEN NEWS EDITOR & CHAIRMAN

Admin

Golden News

Facebook
WhatsApp
Twitter
Telegram