సుప్రీంకోర్టు సంచలన తీర్పు
గోల్డెన్ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం /భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉమ్మడి పినపాక మండలం కాల్వలనాగరంలోని 600 ఎకరాల వివాదాస్పద భూములపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. దశాబ్దాలుగా కొనసాగుతున్న న్యాయ పోరాటానికి ముగింపు పలుకుతూ..ఆ భూమి పట్టా భూమి కాదని, రక్షిత అటవీ భూమేనని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. జస్టిస్ ఎస్వీఎన్ భట్టి ధర్మాసనం ఈ మేరకు తుది ఆదేశాలు జారీ చేసింది. ఈ తీర్పు ఉమ్మడి పినపాక మండల వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా కల్వలనాగరం ప్రాంతంలో భూములపై ఆశలు పెట్టుకున్న పలువురికి ఈ తీర్పు షాక్ ఇచ్చినట్లైంది. మరోవైపు అటవీ శాఖకు ఇది పెద్ద ఊరటనిచ్చినట్లయింది. కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు రెవెన్యూ రికార్డులపై కీలక వ్యాఖ్యలు చేసింది. “రెవెన్యూ రికార్డులు కేవలం పన్నుల వసూలు కోసం మాత్రమే ఉపయోగపడతాయి. అవి భూములపై యాజమాన్య హక్కులను కల్పించవు” అని ధర్మాసనం స్పష్టం చేసింది. ఇదే ‘గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును కూడా సుప్రీంకోర్టు సమర్ధించింది. 1950లో నిజాం ప్రభుత్వం జారీ చేసిన ఫారెస్ట్ నోటిఫికేషనన్ను సవాలు చేస్తూ అప్పీలుదారులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే భూమి తమదేనని నిరూపించే ఒరిజినల్ పత్రాలను సమర్పించలేదని కోర్టు పేర్కొంది. దీంతో 1950 నాటి నోటిఫికేషన్ ప్రకారం ఆ 600 ఎకరాలు అటవీ భూమిగానే కొనసాగుతుందని తేల్చిచెప్పింది. అప్పీలుదారులు దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేసిన సుప్రీంకోర్టు, అటవీ భూముల పరిరక్షణ విషయంలో రాజీ పడలేమనే సంకేతాలను ఇచ్చింది. ఈ తీర్పుతో కల్వలనాగరం భూములపై నెలకొన్న అనిశ్చితికి తెరపడింది








