గోల్డెన్ న్యూస్ /నల్లగొండ : ఆరోగ్య కేంద్రం సిబ్బంది మొత్తాన్ని జిల్లా కలెక్టర్ ఉద్యోగాల నుంచి తొలగించారు. నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి బుధవారం గుర్రంపోడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆరోగ్య కేంద్రంలో సిబ్బంది మొత్తం విధులకు గైర్హాజరు కావడంపై జిల్లా కలెక్టర్ ఆగ్రహించారు. వైద్య సిబ్బంది అందరిని విధుల నుండి సస్పెండ్ చేశారు. బుధవారం ఎలాంటి సెలవును ప్రకటించనప్పటికీ బాధ్యత లేకుండా వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది మొత్తం ముందస్తు అనుమతి లేకుండా విధులకు గైర్హాజరు కావడం సోచనియమని కలెక్టర్ అన్నారు.
కాగా ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం హెల్త్ అధికారి హరిలాల్ మాత్రం ఉపనియామకంపై ఇతర చోట పని చేస్తున్నారు. కాంటాక్ట్ పద్ధతిపై పనిచేస్తున్న ఫార్మసిస్టు శ్యామ్, ల్యాబ్ టెక్నీషియన్ సంధ్య, డేటా ఎంట్రీ ఆపరేటర్ మాధవి, అటెండర్ శ్రీనివాస్, అటెండర్, అరుణ జ్యోతి, అటెండర్ ఎల్లమ్మ లను ప్రభుత్వ ఉద్యోగాల నుండి తొలగిస్తున్నట్లు తెలిపారు. అలాగే అటెండర్ లక్ష్మీనారాయణ, ఫార్మసిస్ట్ భాగ్యమ్మ రెగ్యులర్ ఉద్యోగులను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ముందస్తు అనుమతి లేకుండా విధులకు గైర్హాజర్ అయినా ప్రతి ఉద్యోగిపై చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం, వైద్యానికి అత్యంత ప్రాధాన్యతనిస్తున్నప్పటికీ ప్రజల ఆరోగ్య సంక్షేమాన్ని గాలికి వదిలేసి సిబ్బంది మొత్తం గైర్హాజరు కావడం బాధాకరమని, అందువల్లనే అందరినీ ఉద్యోగాల నుంచి తొలగించడం లేదా విధుల నుండి సస్పెండ్ చేయడం జరిగిందని తెలిపారు.