గోల్డెన్ న్యూస్ / పెబ్బేరు : కొత్తకోటకు చెందిన విద్యాసాగర్ అనే వ్యక్తి కండరాలు పట్టుకున్నాయని నెల రోజుల క్రితం పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి ఆసుపత్రికి వెళ్ళగా.. పరిశీలించిన ఫిజియోథెరపిస్టు సూది మంది ఇవ్వాలని నర్సుకు సూచించారు. ఆమె ఇచ్చిన ఇంజక్షన్ వికటించి, రోగి మలమూత్ర విసర్జన నిలిచిపోయింది. దీంతో స్థానికంగా ఉన్న ఓ వైద్యుడిని సంప్రదించారు. పరీక్షించిన ఆయన మహబూబ్నగర్ వెళ్లమని సూచించారు. అక్కడ పరీక్షలు నిర్వహించిన వైద్యులు శరీరం ఇన్ఫెక్షన్ అయింది, శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుందని, రూ.1.50 లక్షలు ఖర్చు అవుతుందని చెప్పగా. అంత భరించలేమని బాధితుడు ఇంటికి వచ్చారు. విద్యసాగర్ పరిస్థితి విషమించింది. సమాచారం తెలుసుకున్న ఫిజియోథెరపిస్ట్ బాధితుడ్ని పెబ్బేరులో నిర్వహిస్తున్న ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ పరీక్షించిన వైద్యుడు కాలు, ఇతర భాగంలో 14 చోట్ల శస్త్రచికిత్సలు చేశారు. శస్త్ర చికిత్సకు రూ.4 లక్షలు ఖర్చు అయ్యిందని, వాటిని చెల్లించాలని వైద్యులు కోరారు. పట్టణానికి చెందిన పలువురు కొత్తకోటలోని ఆసుపత్రికి వెళ్లి అంత మొత్తం ఇచ్చుకోలేమని వేడుకున్నారు. చివరకు రూ.30 వేలు చెల్లించారు. మిగతా డబ్బు వాయిదాల రూపంలో చెల్లించాలని ఆసుపత్రి యాజమాన్యం ఒప్పంద పత్రం రాయించుకుంది. ఇంటికి వచ్చిన బాధితుడు బంధువులకు విషయం చెప్పగా వారు ఫిజియోథెరపిస్టు వద్దకు వెళ్లి మీరిచ్చిన ఇంజక్షన్ కారణంగానే విద్యాసాగర్ కు శస్త్ర చికిత్స జరిగిందని, అందుకు బాధ్యత వహించి న్యాయం చేయాలని కోరగా ఒప్పుకున్న ఆయన బాధితుడిని ఆసుపత్రికి పంపించారు.నాలుగు రోజుల క్రితం ఫిజియోథెరపిస్టు తన ఆసుపత్రిపై పలువురు దాడి చేశారని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు కేసు నమోదు చేశారు. ఎలాంటి విచారణ జరపకుండానే తమపై కేసు నమోదు చేశారని బాధితులు జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం బాధితుడు పెబ్బేరులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయంపై ఆసుపత్రి యాజమాన్యం శనివారం సామాజిక మాధ్యమంలో ఒక ప్రకటన విడుదల చేశారు. బాధితుడికి వైద్యసేవలు అందిస్తున్నామని, ఆరోగ్యంగానే ఉన్నారని, కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు.









