గోల్డెన్ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం : భద్రాచలం పట్టణంలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘జై బాపు జై భీమ్ జై సంవిధాన్’ రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర శనివారం నిర్వహించారు
ఈ పాదయాత్రను భద్రాచలం పట్టణం పాత మార్కెట్ మహాత్మా గాంధీ కూడలి నుండి అంబేద్కర్ కూడలి లోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వరకు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పొదెం వీరయ్య , భద్రాచలం శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు , తెలంగాణ పీసీసీ జనరల్ సెక్రటరీ మరియు నియోజకవర్గ కోఆర్డినేటర్ శ్రీ ప్రమోద్ నేతృత్వం వహించారు.
ఈ సందర్భంగా ‘జై బాపు జై భీమ్ జై సంవిధాన్’ ప్రతిజ్ఞ చేయించడంతో పాటు, పొదెం వీరయ్య మాట్లాడుతూ.. రాజ్యాంగ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత. సమాన హక్కులు, సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం అందరికీ కల్పించడానికి రాజ్యాంగం విలువలను కాపాడుకోవాలి. దేశంలో శాంతి, అహింసా, మానవత్వం పరిరక్షించాలంటే రాజ్యాంగం స్ఫూర్తితో ముందడుగు వేయాలి. ఈ మహత్తర రాజ్యాంగాన్ని రచించిన కాంగ్రెస్ పార్టీ, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ, రక్షించే బాధ్యతను కూడా కాంగ్రెస్ పార్టీ భుజాలపై వేసుకుంటుంది అని తెలిపారు.
భద్రాచలం ఎమ్మెల్యే డా. తెల్లం వెంకట్రావు మాట్లాడుతూ …రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి, సంక్షేమం అందుబాటులోకి వస్తుంది. ప్రతి గ్రామంలో, ప్రతి ఇంట్లో పార్టీ కార్యక్రమాలను చేరవేసి ప్రజలను చైతన్య పరచాలి అని పేర్కొన్నారు.
టీ పీసీసీ సెక్రటరీ ప్రమోద్ మాట్లాడుతూ ..
కాంగ్రెస్ పార్టీ అంటే పేద ప్రజల సంక్షేమం. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ విజయ సాధన కోసం ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలి. అని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో పలు మండలాల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, యువజన విభాగం. ప్రతినిధులు, మహిళా నాయకులు పాల్గొన్నారు.