గోల్డెన్ న్యూస్ /వెబ్ డెస్క్ : తెలుగు రాష్ట్రాలపై చలి పంజా విసురుతోంది. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గురువారం రాత్రి నుంచే రాష్ట్రవ్యాప్తంగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండ గా, ప్రస్తుతం మరింతగా పడిపోయాయి.
ఇకపై టెంపరేచర్ మరింత తగ్గే అవకాశాలున్నాయని వాతావరణ విభాగం హెచ్చరిస్తోంది. ఇదే సమయంలో ద్రోణి కారణంగా పలు ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉందనే హెచ్చరికలు జారీ అవుతున్నాయి. దీంతో.. ప్రస్తుత సీజన్ లో ఆరోగ్య పరంగా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో రాత్రిపూట చలిగాలుల తీవ్రత ఎక్కువైంది. చాలాచోట్ల కని ష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వర్షాలు దాదాపుగా తగ్గుముఖం పట్టాయి. ఈ నేపథ్యంలో రాత్రి వేళల్లో చలి పెరుగుతుందని భారత వాతావరణ శాఖ పేర్కొంది. రాబోయే వారం రోజుల్లో వాయవ్య, సెంట్రల్ ఇండియాలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-5 డిగ్రీల సెల్సియస్ తక్కువగా ఉండే అవకాశం ఉంది.
సెంట్రల్, వెస్ట్ ఇండియాలో వచ్చే 48 గంటల్లో 2-3 డిగ్రీలు, ఈస్ట్ ఇండియాలో వచ్చే 3 రోజుల్లో 3-4 డిగ్రీలు ఉష్ణోగ్రతలు తగ్గుతాయని అంచనా వేసింది. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. తెలంగాణలో ఆదిలాబాద్ జిల్లా బేలలో శుక్రవారం అతి తక్కువగా 14.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయింది.
హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో చలి ఎక్కువగా వణికిస్తున్నది. రాత్రిపూట ప్రజలు బయటకు వెళ్లాలంటే జంకుతున్నారు.జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 20 నుంచి 25 డిగ్రీల సెల్సి యస్, గరిష్ఠ ఉష్ణోగ్రతలు 29 నుంచి 35 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యాయి. ఈ నెల 9న మరింత తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
వాతావరణ శాఖ ప్రజలకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు, గుండె మరియు శ్వాస సంబంధ సమస్యలతో బాధపడేవారు రాత్రివేళల్లో బయటకు వెళ్లకుండా జాగ్రత్త పడాలని తెలిపింది. రాబోయే రోజుల్లో పలు ప్రాంతాల్లో తక్కువ ఉష్ణోగ్రతలు, పొగమంచు పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నందున, ప్రయాణాలలో అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.








