దేశవ్యాప్తంగా 2 కోట్లకు పైగా ఆధార్ కార్డుల రద్దు
మరణించిన వారి ఆధార్ నంబర్లను రద్దు చేస్తున్నట్లు తెలిపిన యూఐడీఏఐ
ఆధార్ వివరాల దుర్వినియోగాన్ని అరికట్టేందుకే ఈ చర్యలు
మరణ ధ్రువీకరణపత్రంతో ఆధార్ రద్దుకు కుటుంబ సభ్యులు దరఖాస్తు చేసుకోవచ్చన్న యూఐడీఏఐ
దేశవ్యాప్తంగా మరణించిన వ్యక్తులకు సంబంధించిన 2 కోట్లకు పైగా ఆధార్ నంబర్లను రద్దు (డీయాక్టివేట్) చేసినట్లు భారతీయ విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) బుధవారం వెల్లడించింది. ఆధార్ డేటాను ప్రక్షాళన చేయడంతో పాటు, వివరాల దుర్వినియోగాన్ని అరికట్టే లక్ష్యంతో ఈ చర్యలు చేపట్టినట్లు స్పష్టం చేసింది.
అంతేకాకుండా, మరణించిన వ్యక్తి కుటుంబ సభ్యులు కూడా వారి ఆధార్ నంబర్ను రద్దు చేయడానికి అవకాశం కల్పించినట్లు యూఐడీఏఐ సూచించింది. చనిపోయిన వ్యక్తి మరణ ధ్రువీకరణ పత్రాన్ని ‘మై ఆధార్’ వెబ్సైట్లో అప్లోడ్ చేసి, ఆధార్ రద్దు కోసం సులభంగా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది.









