సిగరెట్లు, పాన్ మసాలా ప్రియం

నేటి నుంచి కొత్త పన్నులు.

సిగరెట్ పొడవును బట్టి అదనపు ఎక్సైజ్ డ్యూటీ

పాన్ మసాలాపై కొత్తగా ‘హెల్త్ అండ్ నేషనల్ సెక్యూరిటీ సెస్’ ఈ-సిగరెట్లు, నికోటిన్ ఉత్పత్తులపై 100 శాతం పన్ను

 

అక్రమ రవాణా పెరుగుతుందనే ఆందోళనలో నిపుణులు

 

 

 

దేశంలో ‘సిన్ గూడ్స్’గా పిలిచే పొగాకు ఉత్పత్తుల వినియోగాన్ని తగ్గించడమే లక్ష్యంగా కేంద్రం కొత్త పన్నుల నియమావళిని అమల్లోకి తెచ్చింది. ఇప్పటివరకు ఉన్న 28 శాతం జీఎస్‌టీ ప్లస్ కాంపెన్సేషన్ సెస్ స్థానంలో.. ఇప్పుడు 40 శాతం జీఎస్‌టీతో పాటు అదనపు ఎక్సైజ్ డ్యూటీ, హెల్త్ సెస్ విధిస్తున్నారు. దీనివల్ల సిగరెట్ల ధరలు 15 నుంచి 40 శాతం వరకు పెరిగే అవకాశం ఉంది.

 

సిగరెట్ పొడవు, ఫిల్టర్ రకాన్ని బట్టి పన్నులను ఖరారు చేశారు, 65 మి.మీ లోపు (నాన్-ఫిల్టర్) ఒక్కో సిగరెట్‌పై రూ. 2.05 అదనపు డ్యూటీ, 65 మి.మీ లోపు (ఫిల్టర్) ఒక్కో సిగరెట్‌పై రూ. 2.10 అదనపు డ్యూటీ, మీడియం (65-70 మి.మీ) ఒక్కో స్టిక్‌పై సుమారు రూ. 4 వరకు పెంచారు. అలాగే, ప్రీమియం/లాంగ్ (70-75 మి.మీ) ఒక్కో స్టిక్‌పై రూ. 5.40 వరకు భారం పడనుంది. కొన్ని కేటగిరీల్లో 1000 సిగరెట్లపై రూ. 8,500 నుంచి రూ. 11,000 వరకు ఎక్సైజ్ డ్యూటీ పడనుంది.

 

పాన్ మసాలా, గుట్కా తయారీదారులు ఇకపై తమ ప్యాకింగ్ మెషీన్ల సామర్థ్యం ఆధారంగా పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాకుండా, తయారీ కేంద్రాల్లో తప్పనిసరిగా CCTV కెమెరాలు, ఏర్పాటు చేసి ఆ ఫుటేజీని 24 నెలల పాటు భద్రపరచాలని ప్రభుత్వం ఆదేశించింది. పచ్చి పొగాకుపై 60-70 శాతం, ఈ-సిగరెట్లపై 100 శాతం పన్ను విధించడం ద్వారా ప్రభుత్వం తన కఠిన వైఖరిని స్పష్టం చేసింది.

 

ధరలు పెంచడం ద్వారా ప్రజలు ధూమపానానికి దూరమవుతారని ప్రభుత్వం భావిస్తుండగా, నిపుణులు మాత్రం భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. పన్నులు మరీ ఎక్కువగా ఉంటే, ప్రజలు చౌకగా దొరికే స్మగ్లింగ్ సిగరెట్లు లేదా నకిలీ ఉత్పత్తుల వైపు మళ్లే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. దీనివల్ల ప్రభుత్వ ఆదాయానికి గండి పడటమే కాకుండా, ప్రజల ఆరోగ్యం మరింత దెబ్బతినే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Recent News :

MOHAMMED RAFEE

MOHAMMED RAFEE

GOLDEN NEWS EDITOR & CHAIRMAN

Admin

Golden News

Facebook
WhatsApp
Twitter
Telegram