దేశంలో నియోజకవర్గాల పునర్విభజన.. తెలుగు రాష్ట్రాల్లో పెరగనున్న సీట్లు

దేశవ్యాప్తంగా పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) ప్రక్రియపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2011 జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకుని ఈ పునర్విభజన చేపట్టాలని నిర్ణయించింది. దీనితోపాటే, ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న 33 శాతం మహిళా రిజర్వేషన్ల చట్టాన్ని కూడా ఇదే ప్రాతిపదికన అమలు చేసేందుకు రంగం సిద్ధం చేసింది. ఇందుకు సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లులను ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లోనే ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

 

జనాభా ప్రాతిపదికన సీట్లు పెంచితే, జనాభా నియంత్రణను సమర్థంగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరుగుతుందనే ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలోనే కేంద్రం మధ్యేమార్గంగా 2011 నాటి గణాంకాలను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఈ పునర్విభజనతో దేశవ్యాప్తంగా లోక్‌సభ స్థానాల సంఖ్య ప్రస్తుత 543 నుంచి 816కు చేరనుంది. మహిళా రిజర్వేషన్ల కోటా కింద 273 సీట్లు మహిళలకు కేటాయించబడతాయి.

 

ఈ నిర్ణయంతో తెలుగు రాష్ట్రాల్లోనూ రాజకీయ సమీకరణాలు గణనీయంగా మారనున్నాయి. ఆంధ్రప్రదేశ్ లోక్‌సభ సీట్లు 25 నుంచి 37-38కి, అసెంబ్లీ స్థానాలు 175 నుంచి 262-263కి పెరిగే అవకాశం ఉంది. తెలంగాణలో లోక్‌సభ సీట్లు 17 నుంచి 25-26కి, అసెంబ్లీ స్థానాలు 119 నుంచి 178-179కి పెరగనున్నాయి.

 

ఈ కీలక మార్పులపై ఏకాభిప్రాయం కోసం కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇప్పటికే టీడీపీ, వైసీపీ, బీజేడీ వంటి పార్టీలతో సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. అవసరమైతే ఏప్రిల్ రెండో వారం వరకు పార్లమెంట్ సమావేశాలను పొడిగించి, ఈ బిల్లులను ఆమోదింపజేసుకోవాలని కేంద్రం భావిస్తోంది. మంగళవారం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి, ఈ అంశంపై అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకునే అవకాశం ఉంది.

Recent News :

MOHAMMED RAFEE

MOHAMMED RAFEE

GOLDEN NEWS EDITOR & CHAIRMAN

Admin

Golden News

Facebook
WhatsApp
Twitter
Telegram