కేరళలో వెల్లివిరిసిన మానవత్వం.
గోల్డెన్ న్యూస్ /వెబ్ డెస్క్/ కేరళలోని ఆలప్పుజ జిల్లాలో మానవత్వాన్ని చాటే ఒక అద్భుత ఘటన వెలుగులోకి వచ్చింది. కోజికోడ్ నుండి పతనంతిట్ట వెళ్తున్న కేఎస్ఆర్టీసీ సూపర్ ఫాస్ట్ బస్సు అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఎస్.ఎల్.పురం అనే నిర్మానుష్య ప్రాంతంలో ఆగింది. అక్కడ ఒక యువతి బస్సు దిగగా, ఆ ప్రాంతం చీకటిగా, ఎవరూ లేకపోవడాన్ని గమనించిన డ్రైవర్ అరుణ్ కుమార్, కండక్టర్ సునీల్ ఆమె భద్రత గురించి ఆందోళన చెందారు.
భద్రత కోసం నిలిచిపోయిన బస్సు
యువతిని తీసుకెళ్లడానికి ఇంటి నుండి ఎవరూ రాలేదని తెలుసుకున్న డ్రైవర్, ఆమె కుటుంబ సభ్యులు వచ్చేవరకు బస్సును కదిలించకూడదని నిర్ణయించుకున్నారు.సాధారణంగా బస్సు ఆలస్యమైతే అసహనం వ్యక్తం చేసే ప్రయాణికులు సైతం, ఆ యువతి భద్రత కోసం అక్కడే వేచి ఉండటానికి సంతోషంగా ఒప్పుకున్నారు. మానవత్వం ముందు సమయం ముఖ్యం కాదని అందరూ నిరూపించారు.
అమ్మవడిగా మారిన ఆర్టీసీ బస్సు
యువతి కుటుంబ సభ్యులు వాహనంతో అక్కడికి చేరుకున్నాకే బస్సు ముందుకు సాగింది. బస్సులో ప్రయాణిస్తున్న జుబిన్ జాకబ్ అనే జర్నలిస్ట్ ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకోవడంతో ఇది వైరల్గా మారింది. కేరళలో ‘ఆనబండి’ (ఏనుగు వాహనం)గా పిలువబడే ఈ బస్సు, ఆ యువతిని తల్లిలా కాపాడటంతో నెటిజన్లు దీనిని ‘అమ్మవండి’ అని కొనియాడుతున్నారు.








