ట్రాఫిక్ చలానాలపై హైకోర్టు సీరియస్.

 

తెలంగాణలో ట్రాఫిక్ ఉల్లంఘనల కారణంగా చలానాలు విధించడం సహజం. నిబంధనలను విరుద్ధంగా ఎవరైనా తమ వాహనాలను నడిపితే ట్రాఫిక్ పోలీసులు చలానాలు విధిస్తుంటారు. అయితే.. చలానాలు విధించే క్రమంలో పోలీసులు సొంత మొబైల్ ఫోన్లలో ఫొటోలు తీయడంపై అభ్యంతరం వ్యక్తమవుతోంది. ఇలానే ఓ వ్యక్తికి చలానా విధించడంతో.. ఆ బాధితుడు హైకోర్టును ఆశ్రయించాడు. సొంత ఫోన్లలో ఫొటో తీసి చలానా విధించడం ఏంటని కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. చలాన్ల ఎన్‌ఫోర్స్‌మెంట్ విధానంపై పూర్తి నివేదిక ఇవ్వాలని రాష్ట్ర హోంశాఖకు నోటీసులు జారీ చేసింది.

 

తెలంగాణలో ట్రాఫిక్ ఉల్లంఘనలపై ఈ-చలాన్లు విధించే విధానంపై తెలంగాణ హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. చలాన్ల అమలులో పారదర్శకత లేదంటూ వి. రాఘవేంద్ర చారి దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం.. ఈ అంశంపై పూర్తి వివరణ ఇవ్వాలని రాష్ట్ర హోంశాఖకు నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లోగా కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది.

 

పిటిషనర్ రాఘవేంద్ర చారి, ట్రాఫిక్ పోలీసుల అమలు పద్ధతుల చట్టబద్ధతను ప్రశ్నించారు. ఈ పిటిషన్‌లో ఆయన ప్రధానంగా లేవనెత్తిన అంశాలు ఇలా ఉన్నాయి. ట్రాఫిక్ పోలీసులు తమకు కేటాయించిన అధికారిక పరికరాలకు బదులుగా.. సొంత మొబైల్ ఫోన్లతో వాహనాల ఫోటోలు తీసి చలాన్లు జారీ చేస్తున్నారు. తనపై కూడా ఇలాగే మూడు చలాన్లు విధించారని పిటిషనర్ కోర్టుకు తెలియజేశారు. వ్యక్తిగత మొబైల్ ఫోన్లు లేదా ధృవీకరించబడని పరికరాల ద్వారా తీసిన ఫోటోలు చట్టపరమైన సాక్ష్యంగా చెల్లవని, ప్రభుత్వం ఆమోదించిన నిఘా కెమెరాల ద్వారా మాత్రమే ట్రాఫిక్ ఉల్లంఘనలను రికార్డు చేయాలని పిటిషనర్ వాదించారు.

 

చట్టబద్ధత లేని పద్ధతిలో చలాన్లు వేయడం వల్ల వాహనదారుల హక్కులు దెబ్బతింటాయని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ట్రాఫిక్ పోలీసు సిబ్బంది చట్టవిరుద్ధంగా జరిమానా మొత్తాలను నిర్ణయించడం.. న్యాయ పర్యవేక్షణ లేకుండా డబ్బు వసూలు చేయడంపై కూడా పిటిషనర్ అభ్యంతరం తెలిపారు. శిక్షను నిర్ణయించే అధికారం కేవలం జ్యుడీషియల్ మేజిస్ట్రేట్‌కు మాత్రమే ఉంటుందని.. క్షేత్రస్థాయిలోని కానిస్టేబుళ్లు లేదా ఇన్‌స్పెక్టర్లకు ఆ హక్కు ఉండదని పిటిషనర్ స్పష్టం చేశారు. ఈ రిట్ పిటిషన్ 2011 నాటి ప్రభుత్వ ఉత్తర్వు (జీవో) నెం. 108ని కూడా సవాలు చేసింది. ఈ జీవో పోలీసులకు వాహనాలను ఆపి, కాంపౌండ్ జరిమానాలు అక్కడికక్కడే వసూలు చేయడానికి అధికారం ఇస్తుంది.

 

అయితే ఈ జీవో 108 చట్టవిరుద్ధం, రాజ్యాంగ విరుద్ధం , ప్రాథమిక హక్కులను ఉల్లంఘించేది అని పిటిషనర్ ఆరోపించారు. ఇది న్యాయవ్యవస్థకు ఉన్న అధికారాలను పోలీసులు వినియోగించుకోవడానికి అవకాశం ఇస్తుందని ఆయన ఆరోపించారు. పిటిషనర్ తరపు న్యాయవాది విజయ్ గోపాల్, పోలీసులు దశాబ్దాలుగా చట్టాలను ఉల్లంఘిస్తూ డబ్బు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. హోం శాఖ తరపున ఏజీపీ లక్ష్మీకాంత్ హాజరుకాగా.. జస్టిస్ మాధవి దేవి ప్రాథమిక వాదనలు విన్న తర్వాత.. చలాన్ల ఎన్‌ఫోర్స్‌మెంట్ విధానంపై పూర్తి నివేదిక దాఖలు చేయడానికి రాష్ట్ర హోం శాఖకు నాలుగు వారాల సమయం ఇచ్చారు.

 

ఇదిలా ఉండగా.. రెండు రోజుల క్రితం జరిగిన విచారణలోనూ హైకోర్టు ట్రాఫిక్ అమలు తీరుపై కీలక వ్యాఖ్యలు చేసింది. ట్రాఫిక్ ఉల్లంఘనలకు చలాన్లు విధించిన తర్వాత.. వాటిపై ప్రభుత్వం ఎప్పటికప్పుడు రాయితీలు ప్రకటించడంపై న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రాయితీలు ఇవ్వడం వలన చట్టపరమైన పరిణామాలపై ప్రజల్లోని భయం బలహీనపడి, మరింత ట్రాఫిక్ క్రమశిక్షణ రాహిత్యాన్ని పెంచుతుందని హైకోర్టు పేర్కొంది.

Recent News :

MOHAMMED RAFEE

MOHAMMED RAFEE

GOLDEN NEWS EDITOR & CHAIRMAN

Admin

Golden News

Facebook
WhatsApp
Twitter
Telegram