ఆంధ్రప్రదేశ్లో ఐదుగురు సీనియర్ ఐఏఎస్‌లకు పదోన్నతి.

ప్రభుత్వ కార్యదర్శులుగా నియామకం

2010 బ్యాచ్ అధికారులకు ప్రభుత్వ కార్యదర్శి హోదా

కార్మిక శాఖ కమిషనర్‌గా గంధం చంద్రుడుకు కొత్త బాధ్యతలు

జనవరి 1, 2026 నుంచి అమల్లోకి రానున్న ఉత్తర్వులు

 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో పనిచేస్తున్న ఐదుగురు సీనియర్ ఐఏఎస్ అధికారులకు పదోన్నతి కల్పించింది. 2010 బ్యాచ్‌కు చెందిన ఈ అధికారులకు ప్రభుత్వ కార్యదర్శి హోదాకు సమానమైన సూపర్ టైమ్ స్కేల్ (పే మ్యాట్రిక్స్ లెవల్-14) ఇస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ జీవో జారీ చేశారు. ఈ పదోన్నతులు 2026 జనవరి 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి.

 

ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం పదోన్నతి పొందిన వారిలో చదలవాడ నాగరాణి, డాక్టర్ నారాయణ భరత్ గుప్తా, ఆమ్రపాలి కాట, జె. నివాస్, గంధం చంద్రుడు ఉన్నారు. పరిపాలనలో భాగంగా చేపట్టే సాధారణ ప్రక్రియలోనే ఈ పదోన్నతులు కల్పించినట్లు ప్రభుత్వం పేర్కొంది.

 

పదోన్నతి పొందినప్పటికీ కొందరు అధికారులు తమ పాత పోస్టుల్లోనే కొనసాగనున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్‌గా చదలవాడ నాగరాణి, ఏపీ పర్యాటక అభివృద్ధి సంస్థ వీసీ, ఎండీగా ఆమ్రపాలి కాట తమ ప్రస్తుత బాధ్యతల్లోనే కొనసాగుతారు. డాక్టర్ నారాయణ భరత్ గుప్తా పదవిని కమిషనర్ ఆఫ్ కాలేజియేట్ ఎడ్యుకేషన్‌గా పునర్‌వ్యవస్థీకరించారు.

 

గంధం చంద్రుడుకు కార్మిక శాఖ కమిషనర్‌గా ప్రభుత్వం కొత్త బాధ్యతలు అప్పగించింది. ఇప్పటివరకు ఆ పోస్టులో పూర్తి అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఎం.వి. శేషగిరి బాబు నుంచి ఆయన బాధ్యతలు స్వీకరిస్తారు. జె. నివాస్‌కు సూపర్ టైమ్ స్కేల్ పదోన్నతి కల్పించగా, ఆయనకు కేటాయించే పోస్టింగ్‌పై త్వరలో ఉత్తర్వులు వెలువడనున్నాయి. అవసరమైన చోట పోస్టుల అప్‌గ్రేడేషన్, కేడర్ సమానత్వం కోసం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేస్తామని సీఎస్ విజయానంద్ తెలిపారు.

Facebook
WhatsApp
Twitter
Telegram