గోల్డెన్ న్యూస్ / వెబ్ డెస్క్ /ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిలకలూరిపేట పట్టణంలోని రజక కాలనీ, నెహ్రూ నగర్ ప్రాంతాల్లో గత మూడు రోజులుగా తాగునీటి సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పైపులైన్ లీకేజీ పనుల పేరుతో అధికారులు నీటి సరఫరాను నిలిపివేసినప్పటికీ, కనీసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సప్లై ఉన్న రోజున మాత్రమే కాకుండా, సాధారణ రోజుల్లో కూడా చుక్క నీరు రాకపోవడంతో దాహార్తిని తీర్చుకోవడానికి ప్రజలు అల్లాడిపోతున్నారు.
అధికారులు లీకేజీ మరమ్మతులు చేస్తున్నామని చెబుతున్నారే తప్ప, ప్రజల కనీస అవసరాలను గుర్తించడం లేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ వాటర్ ట్యాంకుల ద్వారా కూడా తాగునీటిని అందించకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని వారు మండిపడుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి, వెంటనే నీటి సరఫరాను పునరుద్ధరించాలని లేదా ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని కాలనీల ప్రజలు వేడుకుంటున్నారు.









