పార్లమెంట్ గొడవ: కేసును ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ కు

పార్లమెంట్ వద్ద తోపులాట..

కేసు ఢిల్లీ క్రైం బ్రాంచ్‌కు..

రాహుల్‌ గాంధీని అరెస్ట్ చేస్తారా?

డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా అవమానించారని ఆరోపిస్తూ కాంగ్రెస్… దీనికి పోటీగా బీజేపీ సభ్యులు చేపట్టిన ఆందోళనలు పార్లమెంట్‌ ప్రాంగణంలో తోపులాటకు దారితీసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో బీజేపీ ఎంపీలు ప్రతాప్ చంద్ర సారంగి, ముకేశ్ రాజ్‌పుత్‌లు కిందపడటంతో ఇరువురికీ గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీపై ఫిర్యాదుతో కేసు నమోదయ్యింది. తాజాగా, ఈ కేసును ఢిల్లీ క్రైమ్‌ బ్రాంచ్‌కు బదిలీ చేయడం గమనార్హం. ఈ కేసును ఇకపై క్రైమ్‌బ్రాంచ్‌ దర్యాప్తు చేస్తుందని అధికారులు వెల్లడించారు. భారత న్యాయ సంహిత (బీఎన్పీ) చట్టంలోని 117, 125, 131, 351, 3(5) సెక్షన్ల కింద రాహుల్‌పై పార్లమెంట్‌ స్ట్రీట్‌ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదయ్యింది.

గాయపడిన ఇద్దరు బీజేపీ ఎంపీల స్టేట్‌మెంట్‌ను రికార్డు చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. అలాగే రాహుల్‌ గాంధీని కూడా విచారణకు హాజరుకావాలని కోరుతామని తెలిపారు. తోపులాటకు సంబంధించి సీసీటీవీ ఫుటేజీ‌ కోసం పార్లమెంట్‌ సెక్రటేరియట్‌కు లేఖ రాస్తామని చెప్పారు. ఘటనలో గాయపడిన రామ్‌మనోహర్‌ లోహియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. క్రమంగా వారు కోలుకుంటున్నారని డాక్టర్లు తెలియజేశారు.

కాగా, బీజేపీ సభ్యులు తమను లోపలికి వెళ్లకుండా ప్రవేశద్వారం వద్ద అడ్డుకున్నారని, ఈ సమయంలో తోపులాట జరిగిందని కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ తెలిపారు. ఈ ఘటనలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కాలికి కూడా గాయమైంది. ఈ క్రమంలో బీజేపీపై కూడా పోలీసులకు కాంగ్రెస్ సభ్యులు ఫిర్యాదు చేశారు. అయితే, రాహుల్ గాంధీపై హత్యాయత్నం కేసు నమోదుచేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. బీఎన్పీ సెక్షన్ 117, 125 కింద కేసు నమోదయితే ఎటువంటి వారెంట్ లేకుండా అరెస్ట్ చేయవచ్చు. దీంతో రాహుల్ గాంధీని అరెస్ట్ చేస్తారనే ప్రచారం కూడా సాగుతోంది.

ఒకవేళ, ఈకేసులో రాహుల్‌ను అరెస్ట్ చేసినా.. ఆయన పార్లమెంట్ సభ్యత్వానికి వచ్చిన ముప్పేమీ ఉండదు. దోషిగా నిర్దారణ అయి.. రెండేళ్లు జైలు శిక్ష పడితే అనర్హత వేటు పడుతుంది. 2019 ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై కేసు నమోదుకాగా.. కింది కోర్టు ఆయనను దోషిగా నిర్దారించింది. రెండేళ్ల జైలు శిక్ష ఖరారుకావడంతో గతేడాది రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేశారు. చివరకు సుప్రీంకోర్టు ఈ తీర్పుపై స్టే విధించడంతో తిరిగి ఆయన పార్లమెంట్ సభ్వత్వాన్ని పునరుద్దరించారు.

Facebook
WhatsApp
Twitter
Telegram