తెలంగాణ రైతులు కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్న రైతు భరోసా పథకం అమలుకు రేవంత్ సర్కార్ జనవరి 26 ముహూర్తం ఖరారు చేసిన విషయం తెలిసిందే.
అదేవిధంగా పథకం అమలుకు సంబంధించి మార్గదర్శకాలను సర్కార్ ఈ నెల 12న విడుదల చేసింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసాను పక్కాగా అమలు చేసేందుకు సర్కార్ పక్కాగా ప్రణాళికలు రూపొందించింది. వర్షా కాలంలో సాగైన భూమి వివరాలను వ్యవసాయ శాఖ నుంచి ప్రభుత్వం తెప్పించుకుంది. దాదాపు 1.49 కోట్ల ఎకరాల్లో పంటలు సాగైనట్లుగా వ్యవసాయ శాఖ అధికారులు సర్కార్కు నివేదికను అందజేశారు. ఆ శాఖ గణాంకాలను ప్రామాణికంగా తీసుకుని ‘రైతు భరోసా’ నిధులను రైతుల ఖాతాల్లో జమచేయాలని భావించిన ప్రభుత్వం అందుకు అవసరమైన నిధులను సిద్ధం చేసింది.
అయితే, సాగుకు యోగ్యమైన భూమి కూడా ఇంతకు మించి ఉండే అవకాశం లేదని అంచనా వేస్తున్న ప్రభుత్వం 1.40 కోట్ల ఎకరాలకు రైతు భరోసా ఇచ్చేందుకు సన్నద్ధమవుతోంది. దాదాపు 3 లక్షల ఎకరాలకు పైగా భూములు సాగుకు యోగ్యం కావని తేల్చిన అధికారులు వాటి సర్వే నెంబర్లను కూడా బ్లాక్ చేశారు. ఈ మేరకు ఎకరాకు రూ.6 వేల చొప్పున పెట్టుబడి సాయం ఈ నెల 26 నుంచి రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. ‘రైతు భరోసా’ అమలుతో రూ.8,900 కోట్లు నిధులు అవసరం అవుతాయని ఆర్థిక శాఖ అంచనా వేస్తోంది.
రైతు భరోసా మార్గదర్శకాలు ఇలా..
♦ రైతు భరోసా పథకం కింద ఎకరాకు సంవత్సరానికి రూ.12 వేల పంట పెట్టుబడి సాయం అందించనున్నారు.
♦ వ్యవసాయ యోగ్యమైన భూమి విస్తిర్ణం ఆధారంగా పట్టాదారులకు రైతు భరోసా సాయం అందనుంది. ఇందులో వ్యవసాయ యోగ్యం కాని భూములకు రైతు భరోసా నుంచి తొలగించాలి.
♦ ఆర్వోఎఫ్ఆర్ పట్టాదారులు కూడా ‘రైతు భరోసా’కు అర్హులే.
♦ ఆర్బీఐ నిర్వహించే డీబీటీ పద్ధతిలో రైతు భరోసా సాయాన్ని రైతుల ఖాతాల్లో జమ చేస్తారు.
♦ రైతు భరోసా పథకాన్ని వ్యవసాయ శాఖ సంచాలకులు అమలు చేస్తారు.
♦ ఎన్ఐసీ హైదరాబాద్ ఐటీ భాగస్వామిగా రైతు భరోసా అపరేషన్స్ను నిర్వహించనున్నారు.









